Saudi Arabia: హజ్ యాత్రికులకు హెచ్చరిక!
ABN, First Publish Date - 2022-06-10T15:43:01+05:30
సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రికులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జెడ్డా: సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రికులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తక్కువ ధరకే హజ్ యాత్ర అంటూ జరిగే ప్రచారాల్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. కొందరు కేటుగాళ్లు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రకటనలతో యాత్రికుల్ని మోసం చేస్తున్నారంటూ మంత్రిత్వశాఖ తెలిపింది. యాత్రికులు ఎట్టిపరిస్థితుల్లో తమ వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వ్యక్తులకు ఇవ్వకూడదని హెచ్చరించింది. తమ అధికారిక యాప్ 'ఈత్మర్నా', అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే హజ్, ఉమ్రా సేవలు పొందవచ్చని తెలిపింది. మోసాలకు పాల్పడే వ్యక్తులు, ఖాతాల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది.
ఇలా మోసాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఇక స్థానిక యాత్రికులు కూడా కేవలం ప్రభుత్వగుర్తింపు పొందిన కంపెనీలు, ఇన్సిట్యూషన్ల ద్వారానే హజ్ యాత్ర సేవలను పొందాలని సూచించింది. స్థానికులకు హజ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ జూన్ 11(శనివారం) వరకు అందుబాటులో ఉంటాయని గుర్తు చేసింది. కాగా, సౌదీ అరేబియా ఈ ఏడాది 1లక్ష మంది విదేశీ యాత్రికులకు హజ్కు అనుమతించిన విషయం తెలిసిందే. ఇక గడిచిన రెండేళ్లు కరోనా కారణంగా ఇతర దేశాలకు చెందిన యాత్రికులకు హజ్కు అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే విదేశీ యాత్రికులు తప్పనిసరిగా కరోనా టీకా తీసుకుని ఉండాలి. అలాగే 65 ఏళ్లలోపు వారు మాత్రమే యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది.
Updated Date - 2022-06-10T15:43:01+05:30 IST