త్వరలో భారతీయులకు ఈ-పాస్పోర్టులు.. విదేశాంగ శాఖ ప్రకటన
ABN, First Publish Date - 2022-01-06T22:53:41+05:30
కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ- పాస్పోర్టులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ- పాస్పోర్టుల్లో బయోమెట్రిక్ ఆధారిత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. వీటి ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా మారుతాయని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ- పాస్పోర్టులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ- పాస్పోర్టుల్లో బయోమెట్రిక్ ఆధారిత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. వీటి ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా మారుతాయని చెప్పారు. ఈ-పాస్పోర్టుల్లో ప్రత్యేక మైక్రోచిప్లు ఉంటాయి. పాస్పోర్టు దారుడికి సంబంధించి బయోమెట్రిక్ డాటా వంటి కీలక వివరాలన్నీ ఈ చిప్లో ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కారణంగా ఈ-పాస్ట్పోర్టులను ఫోర్జరీ చేయడం లేదా నకళ్లు సృష్టించడం మరింత కష్టతరం కానుంది.
కేంద్రం ఇప్పటికే 20 వేలకు పైగా ఆధికారిక, దౌత్య పాస్పోర్టులను ప్రయోగాత్మకంగా జారీ చేసింది. ఈ ట్రయల్ సత్ఫలితాలను ఇస్తే సామాన్యులకు కూడా వీటిని జారీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కాగా.. ఇప్పటివరకూ జారీ చేసిన ఈ పాస్పోర్టులు చిన్న చిన్న బుక్లెట్ల రూపంలో ఉన్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఈ-పాస్పోర్టులను రూపొందించామని కేంద్రం గతంలో తెలిపింది. పాస్పోర్టు ముందువైపున అమర్చే చిప్లో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఈ-పాస్పోర్టు లోగో కూడా నిక్షిప్తమై ఉంటుంది. కాగా.. దేశంలోని అన్ని ప్రాంతీయ పాస్ పోర్టుల కార్యాలయాల ద్వారా ఈ-పాస్పోర్టులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. గతంలో ఉన్న మార్గాల ద్వారానే పౌరులు వీటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2022-01-06T22:53:41+05:30 IST