భారత సంతతి అధికారికి భారీ షాక్.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం!
ABN, First Publish Date - 2022-04-30T03:21:10+05:30
విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన భారత సంతతి అధికారికి సింగపూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
సింగపూర్: విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన భారత సంతతి అధికారికి సింగపూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సింగపూర్ నార్కో టిక్స్ శాఖ అధికారి వెంకటేశ్ రాజ్ నాయర్ నాగరాజన్కు ఈ మేరకు శిక్ష పడింది. మద్యం మత్తులో వెంకటేశ్ విధులకు హాజరైనట్టు, మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేసినట్టు రుజువవడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వెంకటేశ్ తీరుతో బాధితుడికి వేదన కలిగిన కారణంగా అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. 2019 నాటి కేసులో న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలన్ కనియప్పన్ విచారణ సందర్భంగా..అతడిపై వెంకటేశ్ దాడి చేసినట్టు అప్పట్లో అభియోగం దాఖలైంది. శివబాలన్లో బలవంతంగా నేరం ఒప్పించేందుకే ఇలా దాడికి దిగినట్టు తేలింది. మరో సందర్భంలో వెంకటేశ్.. మద్యం మత్తులో విధులకు హాజరైనట్టు కూడా రుజువైంది. సింగపూర్ చట్టాల ప్రకారం.. నిందితులపై దాడికి పాల్పడే అధికారులకు గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. దీనితో పాటూ జరిమానా లేదా.. కొరడా దెబ్బలు కూడా శిక్షగా విధించవచ్చు.
Updated Date - 2022-04-30T03:21:10+05:30 IST