అమెరికా టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యం..! ఎక్కడ చూసినా మనోళ్లే..
ABN, First Publish Date - 2022-04-12T02:36:32+05:30
అమెరికా టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యం..! ఎక్కడ చూసినా మనోళ్లే..
ఎన్నారై డెస్క్: భగవంతుడు లేని ప్రదేశం లేదని చెప్పే క్రమంలో ..ప్రహ్లాదుడు ‘ఇందుగలడు అందు లేడనే సందేహం వలదు’ అని వర్ణిస్తాడు. మరీ ఇంతలా కాకపోయినా ఇప్పుడు ఎన్నారైలు కూడా పాశ్చాత్య కార్పొరేట్ ప్రపంచంలో ఇలాగే విస్తరించారు. ఓ దశాబ్దం నాటి పరిస్థితి చూస్తే.. భారత సీఈఓల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పెప్సీకో చైర్మన్ ఇంద్ర నూయి...గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మాస్టర్ కార్డును విజయపథంలో నడిపించిన అజయ్ బంగా.. ఇలా కొద్ది మంది భారతీయులు మాత్రమే ఉండేవారు. కానీ పదేళ్ల తరువాత సీన్ మొత్తం మారిపోయింది. 2010 దశకంలో తొలి తరం భారతీయులు అమెరికా కంపెనీలకు నేతృత్వం వహిస్తే.. 2020 దశకంలో రెండో తరం భారత సంతతి వారు కూడా కార్పొరేట్ అందలాలను అందుకున్నారు. ప్రస్తుతం టాప్ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న భారత సీఈఓల వివరాలు ఓ మారు చూద్దాం..
రాజ్ సుబ్రమణియన్, Fedex
కెరళకు చెందిన రాజ్సుబ్రమణియన్కు ఫెడ్ఎక్స్ సంస్థతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ ఏడాది మార్చి 29న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు.. సంస్థలో అనేక వ్యూహాత్మక, ఆపరేషనల్ ప్రాధాన్యమున్న అనేక బాధ్యతలను నిర్వర్తించారు. రాజ్ సుబ్రమణియన్ ఐఐటీ బాంబే నుంచి కెమెకల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు.
లీనా నాయర్, Chanel
ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ లగ్జరీ హౌస్ షానెల్కు నేతృత్వం వహించిన తొలి మహిళగా లీనా నాయర్ రికార్డు సృష్టించారు. 2021 డిసెంబర్లో ఆమె కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. లీనా నాయర్ స్వస్థలం మహారాష్ట్ర. ఇండియాలోనే ట్రెయినీగా కెరీర్ ప్రారంభించిన ఆమెకు కన్స్యూమర్ గూడ్స్ రంగంలో ముప్ఫై ఏళ్ల అనుభవం ఉంది. యూనీలెవర్ లండన్ శాఖ మానవవనరుల శాఖకు కూడా ఆమె నేతృత్వం వహించారు. బ్రిటీష్ పౌరసత్వం కూడా పొందారు.
పరాగ్ అగర్వాల్, Twitter
జాక్ డోర్సీ అనంతరం పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈఓగాబాధ్యతలు తీసుకున్నారు. 2021 నవంబర్లో ఈ బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు రెండేళ్ల పాటు ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా సేవలందించారు. ఐఐటీ బాంబేలో చదివిన ఆయన కంపెనీ పని సంస్కృతిలో కొన్ని కీలక మార్పులు తీసుకురాగలిగారు. స్వయంగా తానే పితృత్వ సెలవులు తీసుకోవడంతో పాటూ కింది ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేసే యాజమాన్యల విధానాలను పక్కన పెట్టారు.
సీఎస్ వెంకట కృష్ణన్, Barclays
బార్క్లేస్ సీఈఓగా జెస్ స్టేలీ తప్పుకున్న అనంతరం.. సీఎస్ వెంకటకృష్ణన్ 2021 నవంబర్లో ఈ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత ఎమ్ఐటీ పట్టభద్రుడైన వెంకట కృష్ణన్ బార్క్లేస్లో చేరకమునుపు.. రెండు దశాబ్దాల పాటు జేపీ మోర్గన్ సంస్థలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. బార్క్లేస్ సీఈఓగా నియమితుడైన తొలి శ్వేతజాతీయేతరుడు సీఎస్ కావడం విశేషం.
రంగరాజన్ రఘురామ్, VMware
2021, జూన్లో రంగరాజన్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు ఆయన..వీఎమ్వేర్లోనే ప్రాడక్ట్స్, క్లౌడ్ సర్వీసెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందించారు. 2003లో సంస్థలో చేరిన ఆయన.. కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేస్తూనే.. కార్యకలాపాలను కొత్త రంగాలకు విస్తరించారు.
షార్ దూబే, Match
మ్యాచ్ సంస్థ సీఈఓ శర్మిష్ఠా దూబే..అయితే.. సంస్థలో వారందరూ ఆమెను ఆప్యాయంగా షార్ దూబే అని పిలుస్తుంటారు. 2020 మార్చ్లో ఆమె సీఈఓగా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు ఆమె టిండర్కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సేవలందించారు. టిండర్ యాప్ కూడా మ్యాచ్ సంస్థకు చెందినదే.
సోనియా సింగాల్, Gap
2014లో సోనియా సింగాల్ గ్యాప్ సంస్థలో చేరారు. అంతకుమునుపు.. ఆమె గ్యాప్కు చెందిన బ్రాండ్ ‘ఓల్డ్ నేవీ’కి నాలుగేళ్ల పాటు ముందుండి నడిపించారు. కష్టాల్లో ఉన్న ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్ను గట్టేక్కించేందుకు అమె కంపెనీకి చెందిన షాపుల సంఖ్య తగ్గిస్తూ, సంస్థ మరిన్ని రిస్కులు తీసుకునేలా ప్రోత్సహించారు.
సందీప్ మాత్రానీ, WeWork
సందీప్ మాత్రానీ వీవర్క్ సీఈఓగా 2020 ఫిబ్రవరిలో ఈ బాధ్యతలు చేపట్టారు. కంపెనీ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్, వ్యాపార నిర్వహణ దారుణ ఫలితాలకు దారి తీయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే బాధ్యతను సందీప్ తీసుకున్నారు. ఇతర భారత సంతతి సీఈఓలకు తమ తమ కంపెనీల్లో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉండగా.. సందీప్ మాత్రం సీఈఓగా కంపెనీలో కాలుపెట్టారు.
అరవింద్ కృష్ణ, IBM
ఐఐటీ కాన్పూర్ పట్టభద్రుడైన ఐబీఎమ్ 1990లో ఐబీఎమ్లో చేరారు. 2020 జనవరిలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతకుమునుపు ఐబీఎమ్లో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెడ్ హ్యాట్తో ఐబీఎమ్ కుదుర్చుకున్న భారీ డీల్ వెనుక కృష్ణ కృషి ఎంతో ఉంది. 109 ఏళ్ల చరిత్ర గల ఐబీఎమ్ కంపెనీ కుదుర్చుకున్న అతి పెద్ద డీల్ ఇదే.
సుందర్ పిచాయ్, Alphabet
2015లో సీఈఓ పదవి చేపట్టిన నాటి నుంచి సుందర్ పిచాయ్ గూగుల్కు పర్యాయపదంగా మారిపోయారు. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తరువాత.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ బాధ్యతలను తీసుకున్నారు. క్రోమ్ బ్రౌజర్ లాంచ్ చేయడంలో సుందర్ పిచాయ్ది కీలక పాత్ర
నిరేన్ చౌదరి, Panera bread
నిరేన్ 2019లో పనేరా సంస్థ బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు.. ఆయన క్రిస్పీ క్రీమ్ డోనట్ తయారీ సంస్థలో సీఓఓగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా.. కేఎఫ్సీ టాకో బెల్ మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్లో 23 ఏళ్ల పాటు సేవలందించారు.
రేవతీ అద్వైతీ, Flex
బిట్స్ పిలానీలో రేవతీ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు .2019లో ఫ్లెక్స్లో చేరారు. ఫ్లెక్స్ సంస్థ హెయిర్ డ్రయ్యర్ల నుంచి మాక్స్ వరకూ అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. పని ప్రదేశాల్లో స్త్రేపురుష బేధాల్లేకుండా అందరికీ సమానావకాశాలు ఉండాలని గట్టిగా వాదించే రేవతి, స్టెమ్(STEM) రంగాల్లోనూ మహిళల ప్రాతినథ్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు.
సంజయ్ మెహోత్రా, Micron
బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి అయిన సంజయ్ మెహోత్రా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాన్డిస్క్ వ్యవస్థాపకుల్లో ఆయనా ఒకరు. 2017లో సంజయ్ మైక్రాన్ అధ్యక్షుడిగా, సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు.
జార్జ్ కురియన్, NetApp
కేరళలో పుట్టిన జార్జ్ 2015లో నెట్యాప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుమునుపు.. ఆయన అదే సంస్థలో ప్రాడక్ట్ ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. కాగా కురియన్ సోదరుడు గూగుల్ క్లౌడ్ విభాగానికి సీఈఓగా ఉన్నారు.
పునిత్ రంజెన్, Deloitte
హరియాణాకు చెందిన పునిత్ 2015 మేలో డెలాయిట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. రోటరీ ఫౌండేషన్ స్కాలర్షిప్ సాయంతో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన..ఆ తరువాత విలిమాటే యూనివర్శిటీ నుంచి మేనేజ్మెంట్ పట్టా పొందారు. ఆ తరువాత ఆయన వృత్తిరీత్యా జీవితంలో ఎన్నో అందలాలు ఎక్కారు.
సత్య నాదెళ్ల, Microsoft
హైదరాబాద్లో పుట్టిపెరిగిన సత్య నాదెళ్ల మాస్టర్స్ చదువుల కోసం అమెరికా బాట పట్టారు. 1992లో ఇంజినీర్గా మైక్రోసాఫ్ట్లో చేరారు. సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. మైక్రోసాఫ్ట్లో పనిసంస్కృతినే సమూలంగా మార్చిన వ్యక్తిగా సత్య నాదెళ్ల పేరు గడించారు. బ్యూరోక్రసీ, ఉద్యోగుల మధ్య అసూయలు.. అనుమానాలు, కంపెనీ వ్యూహాల్లో దూరదృష్టి కొరవడటం వంటి అనేక జాడ్యాలను ఆయన వదిలించారు.
Updated Date - 2022-04-12T02:36:32+05:30 IST