ఉక్రెయిన్లోని భారతీయులకు కేంద్రం కీలక సూచన!
ABN, First Publish Date - 2022-02-15T23:43:26+05:30
ఉక్రెయిన్కు సంబంధించి రష్యా, నాటో(NATO) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్కు సంబంధించి రష్యా, నాటో(NATO) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం.. అక్కడి భారతీయులకు తాజాగా కీలక సూచన చేసింది. భారతీయ విద్యార్థులు, పౌరులు వీలైతే ఉక్రెయిన్ను వీడాలని సూచించింది. అత్యవసరమైతేనే ఉక్రెయిన్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్కడి భారతీయ ఎంబసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు తమ వివరాలను భారతీయ రాయబార కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా సూచించింది. రాయబార కార్యాలయం మాత్రం యథావిథిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని పేర్కొంది.
ఉక్రెయిన్పై రష్యా త్వరలో దాడి చేయబోతోందని నాటో దేశాలు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా తన సైన్యాలను భారీ సంఖ్యలో మోహరించింది. పలుమార్లు యుద్ధ విన్యాసాలు కూడా చేపట్టింది. దీంతో.. అమెరికా సహా ఇతర నాటో దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. రష్యా హద్దు మీరితే పర్యవసానం తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ క్రమంలో.. అమెరికా తన మిత్రదేశాలకు మద్దతుగా ఐరోపాకు బలగాలను కూడా తరలించింది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అప్రమత్తమైన అనేక దేశాలు ఉక్రెయిన్లో ఉంటోన్న తమ పౌరులు వెనక్కు రావాలంటూ సూచించాయి.
Updated Date - 2022-02-15T23:43:26+05:30 IST