హైకోర్టును తప్పుదోవ పట్టించిన తల్లీకూతుళ్లకు దిమ్మతిరిగే షాక్..!
ABN, First Publish Date - 2022-06-10T22:39:21+05:30
న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఓ వివాహిత, ఆమె తల్లికి కర్ణాటక హైకోర్టు తాజాగా భారీ షాకిచ్చింది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి.. 2021 జూన్ 6న సమంతా క్రిస్టీనా డెల్ఫీనా విల్లిస్ అనే మహిళకు బెంగళూరు వాసి సయ్యద్ అలీ హిందుస్తానీతో వివాహమైంది. అయితే పెళ్లైన ఐదు రోజులకే..
బెంగళూరు: న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఓ వివాహిత, ఆమె తల్లికి కర్ణాటక హైకోర్టు తాజాగా భారీ షాకిచ్చింది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి.. 2021 జూన్ 6న సమంతా క్రిస్టీనా డెల్ఫీనా విల్లిస్ అనే మహిళకు బెంగళూరు వాసి సయ్యద్ అలీ హిందుస్తానీతో వివాహమైంది. అయితే.. పెళ్లైన ఐదు రోజులకే క్రిస్టీనా తనని విడిచిపెట్టి వెళ్లిపోయిందని సయ్యద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫొటో షూట్ కోసమంటూ తన తల్లి నగలను క్రిస్టీనా, ఆమె తల్లి కోల్కతాకు తీసుకెళ్లిపోయారని ఆరోపించాడు. ఆ తరువాత అటు నుంచి వారు బ్రిటన్కు వెళ్లారని చెప్పుకొచ్చాడు. బ్రిటన్లో ఉండగా వారు ఆస్తికొనుగోలు చేస్తున్నామంటూ మరో ఏడున్నర కోట్లు తన నుంచి రాబట్టారన్నాడు. అదే ఏడాది నవంబర్లో ఇండియాకు వచ్చిన వారు పెళ్లి రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినట్టు వాపోయాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిస్టీనా, ఆమె తల్లిపై చీటింగ్, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే..ఈ కేసును కొట్టేయాలంటూ ఆ తల్లీకూతుళ్లిద్దరూ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సాయంతో మరో వ్యక్తి ద్వారా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కొవిడ్ కారణంగానే ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఇండియాకు రాలేకపోయామని తమ పిటిషన్లో చెప్పుకొచ్చారు. అయితే.. భర్త వేసిన కేసులో బెయిల్ పొందేందుకు వారు అప్పట్లో ఇండియాకు వచ్చి వెళ్లిన విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. ఇది కోర్టు దృష్టికి రావడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఆ తల్లీకూతుళ్ల పిటిషన్ను తిరస్కరించారు.
Updated Date - 2022-06-10T22:39:21+05:30 IST