చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు వెనక్కి తెస్తారు?: రాహుల్
ABN, First Publish Date - 2022-01-28T20:44:36+05:30
చైనా ఆర్మీ అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ తరోన్ను సరిహద్దు..
న్యూఢిల్లీ: చైనా ఆర్మీ అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ తరోన్ను సరిహద్దు ప్రాంతమైన వాచా దమాయ్ పాయింట్ వద్ద భారత్కు పీఎఎల్ఏ అప్పగించడం ఊరట కలిగిస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. చైనా ఆక్రమించుకున్న భూమిని ఎప్పుడు తిరిగి తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.
''మిరామ్ తరోనా వెనక్కి వచ్చాడని తెలిసింది. అలాగే చైనా ఆక్రమించుకున్న భూమిని ఇండియా ఎప్పుడు వెనక్కి తెస్తుందో ప్రధాని చెప్పాలి'' అని రాహుల్ ట్వీట్ చేశారు. 19 ఏళ్ల మిరామ్ను వెనక్కి రప్పించాలని ఈనెల 23న తాను చేసిన ట్వీట్ను తాజా ట్వీట్కు ఆయన జతచేశారు. ఆ సందర్భల్లో మిరామ్ జాడ తెలియకపోవడంపై రాహుల్ ట్వీట్ చేస్తూ.. ''ప్రభుత్వం అనేది ఉంటే మీ బాధ్యత మీరు చేయాలి. మిరామ్ తరోన్ను వెనక్కి రప్పించండి'' అని అన్నారు. ఈనెల 18న అప్పర్ సియాంగ్ జిల్లా జిదో గ్రామానికి చెందిన మిరామ్ తప్పిపోయి చైనా భూభాగంలోకి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం పీఎల్ఏను భారత సైన్యం సంప్రదించడం, అతని ఆచూకీ చిక్కినట్టు పీఎల్ఏ ప్రకటించడం, భారత్ అభ్యర్థన మేరకు ఆ యువకుడిని సరిహద్దు ప్రాంతంలో గురవారంనాడు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
Updated Date - 2022-01-28T20:44:36+05:30 IST