Mamata Banerjeeని దూషించిన కేసులో వ్లాగర్ రొడ్డుర్ అరెస్ట్
ABN, First Publish Date - 2022-06-08T00:04:59+05:30
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)లపై ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో వ్లాగర్ రొడ్డుర్ రాయ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా శనివారం చిట్పూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
టీఎంసీ నేత చేసిన ఫిర్యాదులో చేసిన ఆరోపణల ప్రకారం, నజ్రుల్ మంచలోని ఆడిటోరియంలో గాయకుడు కేకే చివరి కాన్సర్ట్లో కేకే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై రొడ్డుర్ స్పందిస్తూ, ఈ కాన్సర్ట్లో మిస్మేనేజ్మెంట్ జరిగిందని, కేకే మరణానికి కారణం అదేనని అర్థం వచ్చే విధంగా వ్యాఖ్యాలు చేశారు. మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీం, మదన్ మిత్రాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు.
పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, రొడ్డుర్ రాయ్ని గోవాలో అరెస్టు చేశారు. ఆయనను ట్రాన్సిట్ రిమాండ్పై కోల్కతాకు తరలిస్తున్నారు.
Updated Date - 2022-06-08T00:04:59+05:30 IST