Horatti: మరోసారి పరిషత్ సభాపతిగా హొరట్టి
ABN, First Publish Date - 2022-09-16T17:39:24+05:30
విధానపరిషత్ సభాపతిగా సీనియర్ సభ్యుడు బసవరాజహొరట్టిని మరోసారి చేయాలని నిర్ణయించారు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతూ బీజేపీ
- బీజేపీ తీర్మానం... ఎన్నిక ద్వారా ప్రకటించే అవకాశం
బెంగళూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విధానపరిషత్ సభాపతిగా సీనియర్ సభ్యుడు బసవరాజహొరట్టిని మరోసారి చేయాలని నిర్ణయించారు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతూ బీజేపీ సంఖ్యాబలంతో దాదాపు రెండేళ్ళకు పైగా సభాపతిగా హొరట్టి వ్యవహరించారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలకు ముందు జేడీఎస్కు రాజీనామా చేసిన ఆయన సభాపతి స్థానాన్ని వదులుకున్నారు. ఆతర్వాత బీజేపీలో చేరి మరోసారి పరిషత్లోకి వచ్చారు. ఇలా వరుసగా ఎనిమిదవ సారి పరిషత్ సభ్యుడిగా వచ్చిన సీనియర్గా హొరట్టి రికార్డు నమోదు చేశారు. సభాపతి ఎన్నిక ఈనెల 20 లేదా 21న జరిగే అవకాశం ఉంది. హొరట్టిని సభాపతి ఎన్నికకు పోటీ చేయించేందుకు బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకున్నారు. పైగా పరిషత్లో అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో గెలుపు సాధారణం కానుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి కేవలం హొరట్టి పేరును మాత్రమే పంపాలని ముఖ్యమంత్రి బొమ్మై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తాత్కాలిక సభాపతిగా వ్యవహరిస్తున్న రఘునాథ్మల్కాపురను ఉపసభాపతిగా చేయాలని నిర్ణయించారు. వరుసగా ఏడుసార్లు గెలుపొందిన హొ రట్టి బీజేపీలోకి చేరే సందర్భంలోనే పరిషత్ సభాపతి స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మరోసారి ఎన్నికై పరిషత్లోకి వచ్చిన హొరట్టికు తగిన స్థానం ఇవ్వాలని నిర్ణయించారు. పరిషత్లో 75 మంది సభ్యులకు గాను బీజేపీ తరుపున 39మంది ఉన్నారు. ఇండిపెండెంట్ లఖన్ జార్కిహోళి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి 28మంది, జేడీఎస్ నుంచి 8 మంది ఉన్నారు. ఎన్నికలలో గెలుపొందాలంటే 38 మంది మద్దతు అవసరంగా ఉంటుంది. అదనంగా ఇరువురు సభ్యులు ఉండటంతో గెలుపు సునాయాసం కానుంది.
Updated Date - 2022-09-16T17:39:24+05:30 IST