Ad-hoc appointments : ఉత్తరాఖండ్ స్పీకర్ సంచలన నిర్ణయం
ABN, First Publish Date - 2022-09-23T22:23:56+05:30
ఉత్తరాఖండ్ శాసన సభ సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ శాసన సభ సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అడ్-హాక్ నియామకాలను స్పీకర్ రితు ఖండూరీ (Ritu Khanduri) శుక్రవారం రద్దు చేశారు. 2016, 2020, 2021 సంవత్సరాల్లో ఈ నియామకాలు జరిగాయి. శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్ (Mukesh Singhal)ను సస్పెండ్ చేశారు.
రితు ఖండూరీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, శాసన సభ సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా 228 మందికి అడ్-హాక్ అపాయింట్స్ ఇచ్చారని, ఈ నియామకాలను రద్దు చేశామని చెప్పారు. వీరిలో 150 మంది 2016లో, ఆరుగురు 2020లో, 72 మంది 2021లో నియమితులయ్యారని తెలిపారు. శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్ను తక్షణమే అమలయ్యే విధంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ నియామకాలను రద్దు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగినట్లు ఈ కమిటీ గుర్తించిందని చెప్పారు. ఈ నివేదిక గురువారం రాత్రి తనకు అందిందని తెలిపారు. తన నిర్ణయానికి ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తెలియజేశానని చెప్పారు.
Updated Date - 2022-09-23T22:23:56+05:30 IST