ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి : ఉత్పల్ పారికర్
ABN, First Publish Date - 2022-03-10T18:09:38+05:30
గోవా శాసన సభ ఎన్నికల ఫలితాలు కాస్త నిరాశపరిచాయని
పనజీ : గోవా శాసన సభ ఎన్నికల ఫలితాలు కాస్త నిరాశపరిచాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గట్టిగా పోరాడానని చెప్పారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. అయితే కాస్త నిరాశగా కూడా ఉందన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గురువారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆయన దాదాపు 700 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్లు కడపటి వార్తలను బట్టి తెలుస్తోంది.
40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 11 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నట్లు తాజా సమాచారం. బీజేపీ టిక్కెట్ లభించకపోవడంతో ఉత్పల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
Updated Date - 2022-03-10T18:09:38+05:30 IST