అ‘సామాన్యులు’ ఆప్ అభ్యర్థులు
ABN, First Publish Date - 2022-03-11T07:41:52+05:30
అప్పటిదాకా వారు సామాన్యులు. కానీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో
- మొబైల్ మెకానిక్ చేతిలో సీఎం చన్నీ ఓటమి
- సిద్దూని ఓడించిన సాధారణ మహిళా వలంటీర్
చండీగఢ్, మార్చి 10: అప్పటిదాకా వారు సామాన్యులు. కానీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీచేసి అద్భుతం సృష్టించారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూలను ఓడించి సామాన్యుడి సత్తా చాటారు. వారే ఆప్ అభ్యర్థులు లాభ్ సింగ్ ఉగోకే, జీవన్జ్యోత్ కౌర్. లాభ్సింగ్ భదౌర్ నియోజకవర్గంలో చన్నీపై పోటీచేసి 40 వేల ఓట్ల తేడాతో గెలిచారు. మొబైల్ రిపేర్ షాప్లో పనిచేసే లాభ్ చేతిలో చన్నీ ఓడిపోవడం విశేషం. లాభ్ తల్లి ఓ ప్రభుత్వం బడిలో పారిశుధ్య కార్మికురాలు. మరో ఆప్ అభ్యర్థి జీవన్జ్యోత్ కౌర్.. అమృత్సర్ ఈస్ట్లో నవజోత్ సింగ్ సిద్దూని ఓడించారు. ఆమె ఓ సాధారణ మహిళా వలంటీర్. ఈ విజయం పంజాబ్ ప్రజలదే అని ఈ సందర్భంగా కౌర్ అన్నారు. తాను ఇంటింటి ప్రచారం నిర్వహించేటప్పుడు ఓటర్ల నుంచి తనకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుడు తలచుకుంటే హేమాహేమీలను సైతం ఓడించవచ్చన్నారు.
Updated Date - 2022-03-11T07:41:52+05:30 IST