Smriti Irani: ‘కోర్టులో చూసుకుందాం’.. కూతురిపై వస్తున్న ఆరోపణలపై స్మృతి ఇరానీ..
ABN, First Publish Date - 2022-07-24T00:23:26+05:30
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) కుమార్తె జోయిష్ ఇరానీ (Zoish Irani) గోవాలో చట్ట విరుద్ధంగా బార్ (Smriti Irani Daughter Bar Goa) నడుపుతుందనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) కుమార్తె జోయిష్ ఇరానీ (Zoish Irani) గోవాలో చట్ట విరుద్ధంగా బార్ (Smriti Irani Daughter Bar Goa) నడుపుతుందనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా.. తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తన కూతురు చట్ట విరుద్ధంగా బార్ నడుపుతోందన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 18 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లపై, ఒక కళాశాల విద్యార్థినిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఆమెపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తప్పల్లా తన తల్లి రాహుల్ గాంధీపై 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీగా నిలబడటమే అని స్మృతి నిట్టూర్చారు.
గోవా ఎక్సైజ్ శాఖ షోకాజ్ నోటీసును చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ తన కూతురి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా కించపరుస్తోందని, ఆ షోకాజ్ నోటీసులో అసలు తన కూతురి పేరు ఎక్కడుందని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. RTI అప్లికేషన్లో వివరాల ఆధారంగా మాట్లాడుతున్నానని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అంటున్నారని.. ఆ ఆర్టీఐ అప్లికేషన్లో తన కూతురి పేరు ఎక్కడుందని ఈ మహిళా కేంద్ర మంత్రి నిలదీశారు. తన కూతురుపై వచ్చిన ఈ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా చేసినవేనని, ఆమె వ్యక్తిత్వాన్ని చంపేయడమే కాకుండా.. తనను రాజకీయంగా దెబ్బతీయడం కూడా ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశమని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. ఇదంతా కాంగ్రెస్ అధినాయకత్వంగా చెప్పుకునే గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే జరిగిందని ఆమె ఆరోపించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దోచేసిన 5,000 కోట్ల రూపాయల భారతీయుల సంపదకు సంబంధించి ప్రెస్మీట్ పెట్టి మరీ తాను నిలదీసినందుకే ఇలా తన కూతురిని టార్గెట్ చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తన కూతురిపై ఆరోపణలు చేసిన వారి సంగతి న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని ఆమె చెప్పారు. తన కూతురిపై ఆరోపణలు చేసేందుకే పనిగట్టుకుని ప్రెస్మీట్ పెట్టించిన గాంధీ కుటుంబానికి ఒక్కటే చెబుతున్నానని, రాహుల్ గాంధీపై తాను 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తానని, మళ్లీ రాహుల్ను ఓడిస్తానని ఆమె సవాల్ చేశారు. ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక తల్లిగా ఇదే తన శపథం అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రెస్మీట్లో చెప్పారు.
Updated Date - 2022-07-24T00:23:26+05:30 IST