Uddhav Vs BJP : బీజేపీపై ఉద్ధవ్ వ్యంగ్యాస్త్రాలు
ABN, First Publish Date - 2022-09-30T01:42:44+05:30
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) గురువారం బీజేపీపైనా, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంపైనా విరుచుకుపడ్డారు. కాషాయ జెండా ఉండవలసినది వ్యక్తుల హృదయాల్లో అని, కేవలం చేతుల్లో మాత్రమే కాదని అన్నారు. ఈ జెండా తన హృదయంలో ఉందన్నారు. తన వర్గం శివసేన (Shiv Sena) కార్యకర్తలతో ఆయన తన నివాసంలో మాట్లాడారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, హిందుత్వాన్ని కాపాడే అవకాశాన్ని భగవంతుడు తమకు కల్పించాడన్నారు. కాషాయ జెండా కేవలం చేతుల్లో మాత్రమే కాకుండా హృదయాల్లో ఉండాలన్నారు. అది తన హృదయంలో ఉందని చెప్పారు. అక్టోబరు 5న శివాజీ పార్క్లో జరిగే దసరా సభకు క్రమశిక్షణతో హాజరుకావాలని ఉద్ధవ్ తన కార్యకర్తలను కోరారు.
ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ (Congress), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లతో చేతులు కలపడాన్ని ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన, బీజేపీ (BJP) తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. అధికారం కోసం సిద్ధాంతాలతో ఆయన రాజీపడ్డారని, కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఉద్ధవ్, ఏక్నాథ్ వర్గాలు తమదే అసలైన శివసేన పార్టీ అంటూ సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్లను ఆశ్రయించాయి. దీని గురించి ఉద్ధవ్ మాట్లాడుతూ, ఈ యుద్ధంలో సుప్రీంకోర్టుతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్లో కూడా మనం గెలవాలని చెప్పారు.
ఇదిలావుండగా, ఉద్ధవ్ వర్గానికి సుప్రీంకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. తమదే అసలైన శివసేన అని ఏక్నాథ్ షిండే వర్గం చేసిన క్లెయిముపై నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల కమిషన్ను నిరోధించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు.
Updated Date - 2022-09-30T01:42:44+05:30 IST