Jammu And Kashmir : నాలుగు రోజుల తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణ
ABN, First Publish Date - 2022-06-25T20:49:20+05:30
ఎడతెరిపి లేని వర్షాల వల్ల జమ్మూ-కశ్మీరులో నాలుగు రోజులపాటు ఏర్పడిన ట్రాఫిక్ కష్టాలకు
జమ్మూ : ఎడతెరిపి లేని వర్షాల (Incessant Rains) వల్ల జమ్మూ-కశ్మీరులో నాలుగు రోజులపాటు ఏర్పడిన ట్రాఫిక్ (Traffic Jam) కష్టాలకు శనివారం తెర పడింది. రామ్బన్, ఉధంపూర్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి కొండచరియలు (Landslides), మట్టిపెళ్ళలు (Mudslides) విరిగి, జాతీయ రహదారిపై పడటంతో వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నాలుగు రోజులపాటు తాత్కాలికంగా నిలిపేశారు.
270 కిలోమీటర్ల పొడవైన జమ్మూ-శ్రీనగర్ (Jammu-Srinagar) జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను శనివారం నుంచి పునరుద్ధరించినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఉధంపూర్ జిల్లాలోని సమ్రోలీ ప్రాంతంలో ఈ రహదారిపై పడిన కొండచరియను మంగళవారం రాత్రి తొలగించినట్లు చెప్పారు. జమ్మూ వైపు నుంచి, శ్రీనగర్ వైపు నుంచి వాహనాల రాకపోకలను అనుమతించినట్లు తెలిపారు. అయితే ముఘల్ రోడ్డుపై మరొక కొండచరియ శనివారం పడటంతో ట్రాఫిక్కు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని చెప్పారు.
మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో రామ్బన్, ఉధంపూర్ జిల్లాల్లో దాదాపు 36 చోట్ల జాతీయ రహదారి దిగ్బంధనం అయిపోయింది. దాదాపు 2,000 వాహనాలు చిక్కుకున్నాయి. సమీపంలోని కొండ గుట్ట నుంచి పడిన రాళ్ళ వల్ల దెబ్బతిన్న ఉక్కు సొరంగాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరమ్మతు చేస్తోంది. ఈ రహదారిపై ప్రయాణించేవారికి ఈ రాళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మరమ్మతు పనులు చేస్తోంది. ఈ పనులను ప్రతి రోజూ తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 8.00 గంటల వరకు చేపడుతోంది.
జమ్మూ ప్రాంతంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాలను కశ్మీరు ప్రాంతంలోని షోపియాన్ జిల్లాతో అనుసంధానించే రోడ్డు ముఘల్ రోడ్డు. మన్సార్ మోర్ వద్ద ఈ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున కొండచరియ పడింది.
Updated Date - 2022-06-25T20:49:20+05:30 IST