యూర్పలో కరువు విలయతాండవం
ABN, First Publish Date - 2022-08-13T08:51:52+05:30
గలగల ప్రవాహాలతో కళకళలాడే నదులు.. నేడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా.. జలచరాల కళేబరాలతో, ఎండిన ఇసుక మేటలు
ఎండిన నదులు, నీళ్లు లేని ప్రాజెక్టులతో పరిస్థితి తీవ్రం
లక్స్ (ఫ్రాన్స్), ఆగస్టు 12: గలగల ప్రవాహాలతో కళకళలాడే నదులు.. నేడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా.. జలచరాల కళేబరాలతో, ఎండిన ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడే నదీ పరీవాహక ప్రాంతాలు.. మోడువారాయి. అడుగంటిన నీటి నిల్వలతో భారీ నీటి ప్రాజెక్టులు కళతప్పాయి. సాగునీరు లేక వ్యవసాయం కుంచించుకుపోయింది. పశువులకు మేతలేక పాల దిగుబడి భారీగా పడిపోయింది. చివరకు తాగునీటిపై కూడా ఆంక్షలు మొదలవడంతో.. జనం గొంతెండిపోతోంది. ఇదీ.. ప్రస్తుతం యూరప్ దేశాల పరిస్థితి. అక్కడ సగానికి పైగా దేశాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. పశ్చిమ, దక్షిణ, మధ్య యూరో్పలోని చాలా దేశాల్లో వాన చినుకు నేలను తాకి రెండు నెలలు దాటింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గడచిన 500 ఏళ్లలో యూర్పలో సంభవించిన అతి భీకరమైన కరువు ఇదేనని అంటున్నారు. సాధారణంగా శీతకాలంలో కురిసే మంచు ప్రభావంతో వేసవి నాటికి ఇక్కడి నదులు తాజా నీటితో కళకళలాడుతుంటాయని, కానీ, ఈ సారి వాతావరణ మార్పులతో.. శీతాకాలంలో మంచు కురవడం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయని అంటున్నారు. తూర్పు ఆఫ్రికా, పశ్చిమ అమెరికాతో పాటు ఉత్తర మెక్సికోలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి.
బ్రిటన్లో నీటి వినియోగంపై ఆంక్షలు
వడగాడ్పుల ప్రభావంతో.. దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో.. అక్కడ నీటి వినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే నీటితో పాటు తాగునీటికి కూడా కష్టాలు మొదలయ్యాయి. అన్నింటికీ ప్రభుత్వం పరిమితులు విధించింది. నైరుతి, తూర్పు, మధ్య ఇంగ్లాండ్ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్న ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది.
Updated Date - 2022-08-13T08:51:52+05:30 IST