పీఎం భద్రతా లోపంపై సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీ సభ్యులు వీరే...
ABN, First Publish Date - 2022-01-12T17:53:42+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో భద్రతా లోపంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఓ కమిటీని అత్యున్నత న్యాయస్థానం బుధవారం నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ అదనపు డీజీపీ (భద్రతా విభాగం), పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వ్యవహరిస్తారని తెలిపింది.
జనవరి 5న పంజాబ్లోని హుస్సేనీవాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్తున్నపుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతకు లోపం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఈ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఫిరోజ్పూర్ ఫ్లైఓవర్పై మోదీ వాహన శ్రేణి 15-20 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఈ సంఘటన పాకిస్థాన్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగింది.
ఈ సంఘటనకు బాధ్యులను ఈ స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. వీవీఐపీల భద్రతకు లోపం జరగకుండా భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలను కూడా ఈ కమిటీ సూచిస్తుందని తెలిపింది. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఆయన భద్రత కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పత్రాలను జస్టిస్ ఇందు మల్హోత్రాకు సమర్పించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది.
Updated Date - 2022-01-12T17:53:42+05:30 IST