ఐదు రోజుల తర్వాత తెరుచుకున్న ఆలయాలు
ABN, First Publish Date - 2022-01-20T14:00:10+05:30
రాష్ట్రంలో ఐదు రోజుల తర్వాత ఆలయాలతో పాటు ఇతర ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం
- బారులు తీరిన భక్తులు
అడయార్(చెన్నై): రాష్ట్రంలో ఐదు రోజుల తర్వాత ఆలయాలతో పాటు ఇతర ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తోంది. వీటిలో భాగంగా ఐదు రోజుల పాటు అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులను మూసివేయాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 14వ తేదీ నుంచి అన్ని ప్రార్థనా స్థలాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజుల తర్వాత బుధవారం ఉదయం నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను ఆలయాల్లో దర్శనాలకు అనుమతిచ్చారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలైన తిరుచ్చిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, తిరువాణైక్కావల్ జంబుకేశ్వర ఆలయం, మలైక్కోట్టై తాయుమాన స్వామి ఆలయం, సమయపురం మారియమ్మన్ ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, మదురై మీనాక్షి ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, రామేశ్వరం ఇలా అన్ని ప్రధానాలయాల తలుపులు తెరుచుకున్నాయి. అదేవిధంగా నాగూర్ దర్గా, వేలాంకణ్ణి చర్చిల్లో కూడా భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే, మైలాడుదురై, తిరువారూర్, అరియలూరు, కరూర్, పెరంబలూరు, కారైక్కాల్, చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం తదితర జిల్లాల్లో ఉన్న ఆలయాలు కూడా తెరుచుకోగా, భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు.
Updated Date - 2022-01-20T14:00:10+05:30 IST