Kedarnath Temple: బంగారు పూత వద్దంటున్న కేదార్నాథ్ అర్చకులు
ABN, First Publish Date - 2022-09-17T22:08:09+05:30
కేదార్నాథ్ దేవాలయం గర్భగుడిలో గోడలకు బంగారు పూత పూయాలన్న
డెహ్రాడూన్ : కేదార్నాథ్ దేవాలయం గర్భగుడిలో గోడలకు బంగారు పూత పూయాలన్న నిర్ణయాన్ని కొందరు అర్చకులు వ్యతిరేకిస్తున్నారు. శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయానికి గండిపడుతుందని హెచ్చరిస్తున్నారు. బంగారు పూత పూయడం కోసం ఉపయోగించే భారీ డ్రిల్లింగ్ యంత్రాల వల్ల దేవాలయం దెబ్బతింటుందని అంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఓ శివ భక్తుడు కేదార్నాథ్ (Kedarnath) దేవాలయానికి బంగారు పూత పూయించడానికి ముందుకు వచ్చారు. ఆయన ప్రతిపాదనను బదరీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ అంగీకరించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం (Uttarakhand State Government) నుంచి కూడా అనుమతి తీసుకుంది. ఈ నేపథ్యంలో దేవాలయం గోడలకు తాపడం చేసిన వెండి రేకులను తొలగించి, బంగారు రేకులను తాపడం చేయాలని నిర్ణయించడాన్ని తీర్థ పురోహితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్థ పురోహితుడు సంతోష్ త్రివేది మాట్లాడుతూ, బంగారు రేకుల తాపడం వల్ల దేవాలయం గోడలు దెబ్బతింటాయన్నారు. ఈ పనుల కోసం పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషీన్స్ను వాడుతున్నారన్నారు. దేవాలయంలో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని తారుమారు చేయడాన్ని తాము సహించలేమన్నారు.
ప్రస్తుతం కేదార్నాథ్ దేవాలయం గర్భగుడిలో బంగారు రేకుల తాపడం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనిని సీనియర్ అర్చకులు సమర్థిస్తున్నారు. బదరీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ అధ్యక్షుడు అజేంద్ర మాట్లాడుతూ బంగారు పూతను వ్యతిరేకించడం సమర్థనీయం కాదన్నారు. అసలు నిర్మాణానికి విఘాతం కలగకుండా, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. దేవాలయాన్ని ఆధునికీకరించడం, సుందరీకరణ చేయడం సాధారణ విషయమేనన్నారు. వేళ్ళమీద లెక్కబెట్టగలిగినంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, వారికి ప్రాతినిధ్యంవహిస్తున్న సంఘాలు ఆ పని చేయడం లేదని తెలిపారు. కేదార్ సభ మాజీ అధ్యక్షుడు మహేశ్, సీనియర్ అర్చకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దేవాలయం సనాతన ధర్మానికి ప్రధాన కేంద్రమని చెప్పారు. దీనికి బంగారు రేకులను అమర్చే ప్రక్రియను హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు తెలిపారు.
Updated Date - 2022-09-17T22:08:09+05:30 IST