ఉక్రెయిన్ నుంచి వచ్చి వైద్య విద్య కొనసాగించవచ్చు!
ABN, First Publish Date - 2022-03-05T07:02:01+05:30
ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి, యుద్ధం కారణంగా అర్థాంతరంగా తిరిగి స్వదేశానికి వచ్చిన భారత విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం,...
న్యూఢిల్లీ, మార్చి 4: ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి, యుద్ధం కారణంగా అర్థాంతరంగా తిరిగి స్వదేశానికి వచ్చిన భారత విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పలు చర్యలు తీసుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎన్ఎంసీ(ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్)-2021 నిబంధనలను సవరించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు వారి కోర్సులను భారత్ లేదా విదేశాల్లోని ప్రైవేటు కాలేజీల్లో కొనసాగించేలా కేంద్ర వైద్య శాఖ, ఎన్ఎంసీ మార్గదర్శకాలు రూపొందించనున్నాయి. ఇందుకోసం త్వరలోనే ఎన్ఎంసీ, కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ, నీతి ఆయోగ్ ఓ సమావేశం నిర్వహిస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) పేర్కొంది. భారతీయ కాలేజీల్లో వారికి ప్రవేశాలు కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది.
రష్యాలో ఎన్డీబీ లావాదేవీల నిలిపివేత
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాలో అన్ని కొత్త లావాదేవీలను నిలిపివేసినట్టు బ్రిక్స్ కూటమికి చెందిన న్యూ డెవల్పమెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పేర్కొంది. రష్యా దాని మిత్ర దేశం బెలార్సలో తన అన్ని ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్టు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించిన మరుసటి రోజే ఎన్డీబీ ప్రకటన వెలువడింది. బ్రిక్స్, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వనరులను సమీకరించడానికి ఎన్డీబీని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్)లు ఏర్పాటు చేశాయి.
Updated Date - 2022-03-05T07:02:01+05:30 IST