SpiceJetపై రాన్సమ్వేర్ ఎటాక్.. వందలాది విమానాలు ఆలస్యం
ABN, First Publish Date - 2022-05-25T20:05:44+05:30
దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్(SpiceJet)పై రాన్సమ్వేర్(ఒక రకమైన మాల్వేర్) దాడి జరిగింది.
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్(SpiceJet)పై రాన్సమ్వేర్(ఒక రకమైన మాల్వేర్) దాడి జరిగింది. సంస్థ సర్వర్ నెమ్మదించడంతో బుధవారం ఉదయం బయలుదేరాల్సిన వందలాది విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. దీంతో వేర్వేరు ఎయిర్పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్పైస్జెట్ ప్రతినిధి ఒకరు నిర్ధారించారు. మంగళవారం రాత్రి ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ ప్రభావంతో బుధవారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులన్నీ సాధారణంగానే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. పలు స్పైస్జెట్ సిస్టమ్స్పై రాన్సమ్వేర్ దాడి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
తమ ఐటీ బృందం నిరంతరాయంగా పనిచేసి సమస్యలను సరిదిద్దిందని ట్విటర్ వేదికగా స్పైస్జెట్ తెలిపింది. ప్రస్తుతం సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నాయని స్పష్టం చేసింది. విమానాల ఆలస్యంపై వ్యక్తమవుతున్న సందేహాలను నివృతి చేసేందుకు ట్విటర్లో సమాచారం ఇచ్చినట్టు వివరించింది. కాగా బుధవారం ఉదయం పలు ఎయిర్పోర్టుల వద్ద స్పైస్జెట్ ప్రయాణికులు పడిగాపులుకాశారు. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవ్వడంతో స్పందించిన స్పైస్జెట్ సిబ్బంది.. సర్వర్ నెమ్మదించిందని వివరించారు. అయితే పలువురు కస్టమర్లు స్పైస్జెట్ సిబ్బందిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ విమానాలు ఇంకా బయలుదేరలేదంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Updated Date - 2022-05-25T20:05:44+05:30 IST