Shashikala: ఆ సత్తా నాకే ఉంది
ABN, First Publish Date - 2022-12-24T08:00:18+05:30
వచ్చే లోక్సభ ఎన్నికల్లోగా అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువస్తానని,
- లోక్సభ ఎన్నికల్లోగా అన్నివర్గాల విలీనం
- అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ
చెన్నై, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్సభ ఎన్నికల్లోగా అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువస్తానని, నేతలంతా పార్టీలో విలీనమయ్యేలా చేస్తానని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ(VK Shashikala) ప్రకటించారు. శుక్రవారం ఉదయం కీల్పాక్లోని కరుణై ఇల్లమ్లో వృద్ధులతో కలిసి ఆమె క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసిన శశికళ వృద్ధులకు సహాయాలు అందజేశారు. సుమారు వందమందికి బిర్యానీ వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పార్టీకి దూరమైన నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తానని, అది తన వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఇద్దరు నాయకులు (ఈపీఎస్, ఓపీఎస్) వేర్వేరు ప్రకటనలు చేయడంవల్ల పార్టీలో గందరగోళం నెలకొంటోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తన తర్వాత పార్టీకి ఎవరు నాయకులో బాగా తెలుసునని, ఆమె బ్రతికున్నప్పుడే ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించారని వ్యాఖ్యానించారు. జయ మరణంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీకి అన్ని వివరాలు తెలియజేశానన్నారు. డీఎంకే ప్రభుత్వ పాలన సవ్యంగా లేదని, ఎన్నో పథకాలు అమలు చేసినట్లు ప్రకటన చేసి ప్రచారార్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. మిగతా నాలుగేళ్లలోనైనా ఎన్నికల హామీలను నెరవేర్చి, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని శశికళ సూచించారు.
Updated Date - 2022-12-24T08:00:19+05:30 IST