Seven marriages: ఏడడుగులు కాదు.. ఏడు పెళ్లిళ్లు!
ABN, First Publish Date - 2022-09-24T13:15:26+05:30
అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న యువతి భర్త వేలు పట్టుకుని ఏడడుగులు వేస్తుంది.. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా ఏడు పెళ్ళిళ్ళు(Seven marria
- ఎనిమిదో సారి వివాహం
- చేసుకోబోతూ కటకటాల పాలు
- మదురైలో నిత్య పెళ్లికూతురు అరెస్టు
అడయార్(చెన్నై), సెప్టెంబరు 23: అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న యువతి భర్త వేలు పట్టుకుని ఏడడుగులు వేస్తుంది.. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా ఏడు పెళ్ళిళ్ళు(Seven marriages) చేసేసుకుంది. పెళ్లికొడుకు శోభనం మురిపెంలో ఉండగానే, తట్టాబుట్టా సర్దుకుని, దొరికినన్ని నగలతో ఉడాయించడం ఆమెకు ఆనవాయితీగా మారింది. అయితే ఎనిమిదో మారు పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైన ఈ యువతి.. ఎట్టకేలకు కటకటాలపాలైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా... నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరుకు చెందిన ధనపాల్ (35) మదురై(Madurai)కు చెందిన సంధ్య (26) అనే మహిళను ఈ నెల 7వ తేదీ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ సమయంలో వధువు తరపున ఆమె అక్క, మామ వరుస అయిన ఇద్దరు, పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగన్ (45) మాత్రమే వచ్చారు. ఈ వివాహం తర్వాత పెళ్ళిళ్ళ బ్రోకర్ కమిషన్గా రూ.1.50 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వధూవరులిద్దరూ వరుడి ఇంటికి వెళ్ళారు. రెండు రోజుల పాటు భర్తతో కాపురం చేసిన సంధ్య 9వ తేదీ రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, నగదు సర్దుకుని అదృశ్యమైపోయింది. నిద్ర లేచిన తర్వాత భార్య కనిపించకపోవడంతో ధనపాల్ భార్య మొబైల్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో సందేహించి బీరువా తెరిచి చూడగా, అందులోని విలువైన వస్తువులు, నగలు, పట్టుచీరలు కనిపించలేదు. తాను మోసపోయానని గ్రహించిన ధనపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో వ్యక్తితో పెళ్ళికి సిద్ధం...
ఈ నేపథ్యంలో సంధ్య అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో మధ్యవర్తి ధనలక్ష్మి (45) ద్వారా పెళ్ళి సంబంధం కుదుర్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ధనపాల్ అప్రమత్తమై, పెళ్ళి జరిగే తిరుచ్చెంగోడు ప్రాంతానికి తన కుటుంబ సభ్యులతో వెళ్ళాడు. వీరు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక కారులో సంధ్య, మధ్యవర్తి, మరో బంధువు వచ్చి దిగారు. వీరిని ధనపాల్ కుటుంబ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇప్పటికే ఆరు పెళ్ళిళ్ళు...
మదురైకు చెందిన సంధ్యకు ఇప్పటికే ఆరు పెళ్ళిళ్ళు జరిగాయి. ధనపాల్ ఏడో భర్త. ఎనిమిదో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయింది. వివాహం జరిగిన తర్వాత రెండు రోజుల మాత్రమే సంసారం చేసి, మూడో రోజు నగలు, నగదుతోపాటు ఇతరవిలువైన వస్తువులతోపత్తాలేకుండా పారిపోయేది. ఈమెకు పలువురు పెళ్ళిళ్ళ బ్రోకర్లు సహకరించినట్లు విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-09-24T13:15:26+05:30 IST