Lakhimpur violence కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు...సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
ABN, First Publish Date - 2022-04-18T17:02:07+05:30
లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది....
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు... వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. ‘‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది’’ అని సుప్రీం పేర్కొంది.‘‘హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదు’’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడు. అక్టోబరు 9వతేదీన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరైంది.అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు.నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండించారు.
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిరసన తెలిపిన రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని పేర్కొంది. అంతకుముందు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
Updated Date - 2022-04-18T17:02:07+05:30 IST