Azamgarh జిల్లాలో సమాజ్వాదీ పార్టీ క్లీన్ స్వీప్
ABN, First Publish Date - 2022-03-11T17:43:16+05:30
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని రికార్డు సృష్టించినా, ఆజంఘడ్ జిల్లాల్లో మాత్రం ఆ పార్టీ ప్రభావం చూపించలేక పోయింది....
పది స్థానాలుండగా 9 సీట్లలో విజయ దుందుభి...అధికార బీజేపీకి నిరాశ
ఆజంఘడ్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని రికార్డు సృష్టించినా, ఆజంఘడ్ జిల్లాల్లో మాత్రం ఆ పార్టీ ప్రభావం చూపించలేక పోయింది.ఆజంఘడ్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 9 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పదింట తొమ్మిది స్థానాలను గెల్చుకున్న సమాజ్వాదీ పార్టీకి ఆజంఘడ్ జిల్లా కంచుకోటగా నిలిచింది. ఆజంఘడ్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ సమాజ్వాదీ పార్టీ, బీజేపీల మధ్య జరిగింది. అజంగఢ్, దిదర్గంజ్, ఫూల్పూర్-పావై, నిజామాబాద్, మెహ్నగర్, ముబారక్పూర్, సాగి, గోపాల్పూర్, లాల్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆజంఘడ్ జిల్లాలోని అత్రౌలియా ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే కాషాయ పార్టీ కైవసం చేసుకుంది.
అజంగఢ్ సీటులో ఎస్పీ అభ్యర్థి దుర్గాప్రసాద్ యాదవ్ 16,036 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అఖిలేష్ మిశ్రాను ఓడించారు.దిదర్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీకి చెందిన కమల్కాంత్ తన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కృష్ణమురారీపై 13,561 ఓట్ల తేడాతో విజయం సాధించారు.మెహ్నగర్ అసెంబ్లీ స్థానాన్ని సమాజ్వాదీ పార్టీకి చెందిన పూజ 14,149 ఓట్ల తేడాతో కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి మంజు సూరజ్పై విజయం సాధించి ఆమె ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.ఫూల్పూర్-పావై స్థానంలో కూడా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
రమాకాంత్ బీజేపీ అభ్యర్థి రామ్ సూరత్పై 25,306 ఓట్ల తేడాతో విజయం సాధించారు.నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా అఖిలేష్ యాదవ్ పార్టీ కైవసం చేసుకుంది. ఎస్పీ అభ్యర్థి ఆలం బడి 34,187 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ముబారక్పూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి అఖిలేష్ 29,103 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అరవింద్ జైస్వాల్పై విజయం సాధించారు.సాగి సీటును సమాజ్వాదీ పార్టీకి చెందిన హృదయ్ నారాయణ్ సింగ్ పటేల్ కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బందన సింగ్పై 22,515 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.గోపాల్పూర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది.
నఫీస్ అహ్మద్ భారతీయ జనతా పార్టీకి చెందిన సత్యేంద్ర రాయ్పై 24,307 ఓట్ల తేడాతో విజయం సాధించారు.లాల్గంజ్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి బెచాయ్ 14,500 ఓట్లకు పైగా బీజేపీకి చెందిన నీలంపై విజయం సాధించారు.
ఆజంఘడ్లో ఒకే ఒక్క స్థానంలో బీజేపీ విజయం
ఆజంఘడ్ జిల్లాలో అధికార బీజేపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. అత్రౌలియా అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సందీప్ సింగ్ 39,324 ఓట్ల తేడాతో ఎస్పీకి చెందిన ప్రశాంత్ సింగ్పై విజయం సాధించారు.
Updated Date - 2022-03-11T17:43:16+05:30 IST