Independence Day Celebrations: జాతీయ జెండాను ఎగురవేయవద్దు, సిక్కు జెండాను ఎగరేయండి : పంజాబ్ ఎంపీ
ABN, First Publish Date - 2022-08-10T20:11:21+05:30
భారతీయులంతా 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు
చండీగఢ్ : భారతీయులంతా 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) పార్టీ చీఫ్, పంజాబ్ (Punjab)లోని సంగ్రూర్ ఎంపీ సిమ్రన్జిత్ సింగ్ మాన్ (Simranjit Singh Mann) తీవ్ర వివాదం సృష్టించారు. ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని బహిష్కరించాలని, సిక్కు జెండా అయిన నిషాన్ సాహిబ్ను ప్రతి ఇల్లు, కార్యాలయం వద్ద ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Shiromani Akali Dal (Amritsar) పార్టీ చీఫ్ మాన్ వేర్పాటువాది. ఆయన మన దేశ రక్షణ దళాలను శత్రు దళాలుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా (ఇంటింటా త్రివర్ణ పతాకం) కార్యక్రమాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 14-15నాడు ఇళ్లు, కార్యాలయాల వద్ద నిషాన్ సాహిబ్ను ఎగురవేయాలని కోరారు. సిక్కులు స్వతంత్రులని, ప్రత్యేకమైన జాతి అని దీప్ సిద్ధు చెప్పారన్నారు. జర్నయిల్ సింగ్ భింద్రన్వాలే శత్రు దళాలతో పోరాడుతూ అమరుడయ్యారని పేర్కొన్నారు.
జర్నయిల్ సింగ్ భింద్రన్వాలే ఖలిస్థాన్ ఉగ్రవాది అనే విషయం తెలిసిందే. అదే విధంగా Sikhs for Justice (SFJ) నేత గుర్పత్వంత్ సింగ్ పన్ను కూడా పంజాబీలను, సిక్కులను రెచ్చగొట్టేందుకు ఓ వీడియోను విడుదల చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవాలనాడు త్రివర్ణ పతాకాన్ని దహనం చేయాలని, ఖలిస్థాన్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చాడు. పన్ను ఉగ్రవాది అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అమెరికాలో ఉంటూ ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటు కోసం రెచ్చగొడుతున్నారు.
ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమంపై శిరోమణి అకాలీదళ్ వైఖరి విమర్శలపాలవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ మాట్లాడుతూ, ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని బహిష్కరించడంతో వారి నిజరూపం బయటపడిందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసినవారి, ప్రయాణ భత్యాలను కోరినవారి (సిమ్రన్జిత్ సింగ్ మాన్) అసలు స్వరూపం వెల్లడైందన్నారు. మాన్కు ఎవరూ విలువ ఇవ్వకూడదని చెప్పారు. వేలాది మంది పంజాబీలు ప్రాణత్యాగం చేశారని చెప్పారు. జాతీయ పతాకం పట్ల తమకు గొప్ప గౌరవం ఉందని తెలిపారు.
శిరోమణి అకాలీదళ్ నేత డాక్టర్ దల్జీత్ చీమా మాట్లాడుతూ, జాతీయ పతాకం ప్రతి ఒక్కరిదీనని చెప్పారు. జాతీయ పతాకం పంజాబీలందరికీ గర్వకారణమని తెలిపారు. అత్యధిక పంజాబీలు ప్రాణత్యాగం చేశారన్నారు. అమరుల్లో అత్యధికులు సిక్కులేనని చెప్పారు.
బీజేపీ నేత వినీత్ జోషీ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఐఎస్ఐ చేతిలో కీలుబొమ్మ మాదిరిగా గుర్పత్వంత్ సింగ్ పన్ను వ్యవహరిస్తున్నారన్నారు. పన్ను పిలుపులకు ప్రజా స్పందన లేదన్నారు. పన్నుపై అనేక కేసులు నమోదయ్యాయని, ఆయనను భారత దేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-08-10T20:11:21+05:30 IST