రష్యాలోని విదేశీ కంపెనీలకు షాక్
ABN, First Publish Date - 2022-02-27T15:12:12+05:30
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా తదితర
మాస్కో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా తదితర దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా కూడా అదే రీతిలో ప్రతిస్పందించింది. తమ దేశంలోని విదేశీ పౌరులు, విదేశీ కంపెనీల నిధులను జప్తు చేస్తామని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ దిమిత్రి మెద్వెదెవ్ చెప్పారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్, మైత్రీ భావం లేని ఇతర అధికార పరిధుల్లో నమోదైన కంపెనీల ఆస్తులను జాతీయీకరించడాన్ని కొట్టి పారేయలేమని మెద్వెదెవ్ చెప్పినట్లు రష్యన్ మీడియాను ఉటంకిస్తూ అరేబియన్ మీడియా వెల్లడించింది.
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సహా రష్యన్ ఆస్తులను స్తంభింపజేయడానికి యూరోపియన్ యూనియన్ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
కొన్ని రష్యన్ బ్యాంకులపై పాశ్చాత్య దేశాలు ప్రకటించిన కొత్త చర్యలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు SWIFT ఇంటర్నేషనల్ పేమెంట్స్ సిస్టమ్ శనివారం తెలిపింది. ఏయే సంస్థలపై ఈ ఆంక్షలను అమలు చేయాలో తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ అధికారులను సంప్రదిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలావుండగా, ఉక్రెయిన్పై గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్లో రోడ్డు పక్కన ఉండే మార్గ సూచీలను ఆ దేశ ప్రభుత్వం తొలగిస్తోంది. వీటిని రష్యా సేనలు ఉపయోగించుకోకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఈ పని చేస్తోంది. శత్రువుకు కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉండాలనే ఇలా చేస్తున్నట్లు రోడ్ల నిర్మాణం, నిర్వహణ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ కంపెనీ ఫేస్బుక్ పోస్ట్లో, ‘‘నేరుగా నరకానికి పోయేలా వారికి సాయపడదాం’’ అని రాశారు.
Updated Date - 2022-02-27T15:12:12+05:30 IST