పంజాబ్లో కల్లోల కాంగ్రెస్!
ABN, First Publish Date - 2022-01-11T09:55:00+05:30
అసెంబ్లీ ఎన్నికల ముంగిట పంజాబ్ కాంగ్రె్సలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా సీఎం చరణ్జిత్సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ నడుమ పరస్పర విమర్శల తో ఆ పార్టీ బేజారవుతోం ది. ..
పార్టీలో మిన్నంటిన వర్గపోరు
సీఎం చన్నీతో సిద్ధూ ఢీ అంటే ఢీ
చేతులు కలిపిన అకాలీ-బీఎ్సపీ
జట్టుకట్టిన అమరీందర్-బీజేపీ
చండీగఢ్, జనవరి 10: అసెంబ్లీ ఎన్నికల ముంగిట పంజాబ్ కాంగ్రె్సలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా సీఎం చరణ్జిత్సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ నడుమ పరస్పర విమర్శల తో ఆ పార్టీ బేజారవుతోం ది. ఇంకోవైపు.. రాష్ట్రం పలు కీలక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఐదేళ్ల కింద నెలకొన్న ప్రధాన సమస్యలు.. నిరుద్యో గం, డ్రగ్స్ మాఫియా, గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం కేసులు ఇప్పుడూ కీలకంగా మారాయి. పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని 2017 ఎన్నికల సమయంలో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాలు గేళ్ల వరకు ఆ పని చేయలేదు. ఎన్నికల ముంగిట సీఎం చన్నీ 36 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసే బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నారు. కానీ గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ దాన్ని ఇంకా ఆమోదించలేదు. 2017కి ముందు ప్రకాశ్సింగ్ బాదల్ సారథ్యంలోని శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణా జోరు గా సాగేది. దీన్ని అరికడతామన్న హామీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. పైగా మరింత పెచ్చరిల్లింది. అన్నిటికంటే కీలకమైనది సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం. బాదల్ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై నాటి సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ విచారణ జరిపించారు. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో సిద్ధూ బహిరంగంగానే ఆయన్ను టార్గెట్ చేశారు.
కాంగ్రె్సలో చేరిన సోనుసూద్ సోదరి
ప్రముఖ సినీ నటుడు సోను సూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీ సమక్షంలో మాళవిక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతు సంఘాలు ఆప్వైపే!
అమరీందర్ సీఎంగా ఉన్నప్పుడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు అండగా నిలిచారు. అయితే ఆయన రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. బీజేపీతో, అకాలీదళ్ సంయుక్త్ పార్టీ నేత సుఖ్దేవ్ సింగ్ థిండ్సాతో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీచేయబోనున్నారు. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ బలహీనపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అమరీందర్ తర్వాత ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందన్న సిద్ధూ ఆశలపై అధిష్ఠానం నీళ్లు చల్లింది. చన్నీని సీఎంగా చేయడం.. తనకు నచ్చనివారికి ఆయన పదవులు ఇవ్వడంతో సిద్ధూ ఒక దశలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
రాహుల్గాంధీ, ప్రియాంక వాద్రాల జోక్యంతో వెనక్కి తగ్గినా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. తన వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సిద్ధూ, చన్నీలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రైతు సంఘాలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైపు మొగ్గుచూపుతున్నాయని రాజకీయ వర్గాల అంచనా. ఆప్ కూడా ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. కేజ్రీవాల్ పలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు. ఇక సాగు చట్టాల కారణంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బాదల్ అకాలీదళ్ ఇప్పుడు బీఎస్పీతో జట్టుకట్టి బరిలోకి దిగుతోంది. గతంలో పార్టీని వీడిన సీనియర్లంతా వెనక్కి వస్తుండడంతో అకాలీల్లో విజయంపై ఆశలు చిగురిస్తున్నాయి. పంజాబ్లో 32ు జనాభా ఎస్సీలే కావడంతో బీఎస్పీతో పొత్తు కారణంగా ఆ ఓట్లు తనకే పడతాయని అకాలీదళ్ భావిస్తోంది. దళిత నేత అయిన సీఎం చన్నీని కాంగ్రెస్ నామ్కే వాస్తేగా పదవిలో కూర్చోబెట్టిందని.. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో దళితుల్లో అసంతృప్తి నెలకొందని.. అన్నిటినీ మించి కాంగ్రెస్ ఓట్లను కెప్టెన్ అమరీందర్ చీల్చేస్తారని.. ఈ పరిణామాలన్నీ తమకే లాభిస్తాయని బాదల్ అంచనా వేస్తున్నారు. సాగు చట్టాల రద్దు దరిమిలా బీజేపీపై రైతు వ్యతిరేక ముద్ర పోయిందని.. కాంగ్రెస్ అసంతుష్ట నేతలు, టికెట్లు దక్కని వారు తనతో చేరతారని అమరీందర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. దానికి తగినట్లుగా పలువురు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆయన పార్టీలోను, బీజేపీలోను చేరుతున్నారు. ఇది కాంగ్రె్సను కలవరపరుస్తోంది. ఇంకోవైపు.. ఇన్నాళ్లూ బాదల్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ వచ్చిన బీజేపీ.. బాదల్ నీడ నుంచి బయటపడి అమరీందర్ సహకారంతో రాష్ట్రంలో కీలక పార్టీగా ఆవిర్భవించేందుకు సకల ప్రయత్నాలూ చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తన ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపం ఏర్పడడం.. ఆందోళనకారులు ఆయన కాన్వాయ్ను అడ్డుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Updated Date - 2022-01-11T09:55:00+05:30 IST