పంజాబ్ సీఎం అభ్యర్థిపై త్వరలో ప్రకటన:పైలట్
ABN, First Publish Date - 2022-01-28T23:01:14+05:30
పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కార్యకర్తలతో సంప్రదించి త్వరలోనే పార్టీ..
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కార్యకర్తలతో సంప్రదించి త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తెలిపారు. పంజాబ్లో భిన్నమైన పరిస్థితి ఉండటం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ కార్యకర్తలు కోరుతుండటంతో కార్యకర్తలతో సంప్రదించి త్వరలోనే అభ్యర్థి విషయంలో ఒక ప్రకటన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్టు పైలట్ తెలిపారు.
సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాలని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని, పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారంనాడు రాహుల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. జలంధర్లో జరిగిన వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రస్తావన చేస్తూ, ఎవరి సారథ్యంలో పంజాబ్ను ముందుకు తీసుకువెళ్లాలనే విషయంలో కారులో కూర్చుని తాము సంభాషించామని, సిద్ధూ, చన్నీలు సైతం ఇది కీలక విషయంగా తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇద్దరిలో ఎవరిని ప్రకటించినా రెండో వ్యక్తి సపోర్ట్ ఉంటుందని వారు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. వారి నిర్ణయం సంతోషం కలిగించిందని, సీఎం అభ్యర్థిని నిర్ణయించాలని పార్టీ కార్యకర్తలనే తాము అడుగుతామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థగా ఎవరిని అధిష్ఠానం ప్రకటిస్తుందనే విషయంలో ఇటు చన్నీ, అటు సిద్ధూ టెన్షన్లో ఉన్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
Updated Date - 2022-01-28T23:01:14+05:30 IST