Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝున్ఝున్వాలా మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం
ABN, First Publish Date - 2022-08-14T15:48:10+05:30
బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్, బిగ్ బుల్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ : బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్, బిగ్ బుల్ ఆఫ్ ఇండియా ((Big Bull of India))రాకేశ్ ఝున్ఝున్వాలా (Rakesh Jhunjhunwala) మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రగాఢ సంతాపం తెలిపారు. మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్లో, రాకేశ్ ఝున్ఝున్వాలా ఎదురులేని వ్యక్తి అని, గొప్ప విజ్ఞానవంతుడని, స్టాక్ మార్కెట్ అంశాల్లో మంచి పట్టు ఉన్న పెట్టుబడిదారు అని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారని, హాస్య చతురత కలవారని కొనియాడారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన నిష్కళంక సేవలందించారని తెలిపారు.
భారత దేశ అభివృద్ధి కోసం రాకేశ్ తపించేవారని తెలిపారు. ఆయన మరణించడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను అభిమానించేవారికి ప్రగాఢ సంతాపం, సానుభూతి చెప్తున్నట్లు తెలిపారు. ఓం శాంతి అని పేర్కొన్నారు.
రాకేశ్ మృతి పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturwedi) ప్రగాఢ సంతాపం తెలిపారు. బడ్జెట్ ఎయిర్లైన్ ఆకాశా ఎయిర్ (Akasa Air) సహ వ్యవస్థాపకుడైన ఆయన ఆ సంస్థ సేవలు ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కేవలం స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే ఆలోచించలేదని, దేశం కోసం ఆయన పరితపించారని వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Updated Date - 2022-08-14T15:48:10+05:30 IST