High alert: పీఎఫ్ఐపై నిషేధంతో రాష్ట్రంలో హై అలర్ట్
ABN, First Publish Date - 2022-09-29T13:48:44+05:30
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై కేంద్రప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమైం
- చెన్నై కార్యాలయానికి భారీ భద్రత
చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై కేంద్రప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ కార్యాలయాలు, సంస్థ నిర్వాహకుల నివాసాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల నివాసాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. వాటిని నిరసిస్తూ రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరుప్పూరు, మదురై, పొల్లాచ్చి, మేట్టుపాళయం(Coimbatore, Tiruppur, Madurai, Pollachi, Mettupalayam) ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూమున్నని నేతల నివాసాలపై పెట్రోలు బాంబులతో దాడులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఆ సంస్థ కార్యకలాపాలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. దీంతో రాష్ట్రంలో ఆ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల నివాసాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురుషవాక్కం మూక్కాత్తాళ్ వీధిలో ఉన్న ఆ సంస్థ రాష్ట్ర విభాగం కార్యాలయం వద్ద బుధవారం ఉదయం సుమారు పదిహేను మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇదే విధంగా మన్నడి, ట్రిప్లికేన్, ఐస్హౌస్, జామ్బజార్ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా వేస్తున్నారు.
Updated Date - 2022-09-29T13:48:44+05:30 IST