పార్టీ వ్యతిరేకులను వదలను!
ABN, First Publish Date - 2022-10-03T09:26:01+05:30
రాజస్థాన్ కాంగ్రెస్ సర్కారులో ఇటీవల చోటు చేసుకున్న హైడ్రామాపై సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు.
సచిన్పై సీఎం గెహ్లోత్ నర్మగర్భ వ్యాఖ్యలు
‘తన’ ఎమ్మెల్యేలకు ద్రోహం చేయనని వెల్లడి
జైపూర్, అక్టోబరు 2: రాజస్థాన్ కాంగ్రెస్ సర్కారులో ఇటీవల చోటు చేసుకున్న హైడ్రామాపై సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని వదిలేదని ఆయన అన్నారు. పరోక్షంగా.. సచిన్ పైలట్ను ఉద్దేశించి నర్బగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులను వదిలేది లేదు. వారి వ్యవహారంపై విచారణ చేయిస్తా’’ అని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తనకు మద్దతుగా.. రాజీనామాలు చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు తాను ద్రోహం చేయలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులోకి వెళ్తే.. సీఎం పీఠం నుంచి గెహ్లోత్ను తప్పించి.. మరోనేత సచిన్ పైలట్ను ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అశోక్ మద్దతుదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన సీఎం.. వారికి తాను ద్రోహం చేయలేనన్నారు. అదేసమయంలో 2020నాటి ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కొందరు.. బీజేపీతో చేతులు కలిపి.. కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నారని, అప్పట్లోనూ 102 మంది ఎమ్మెల్యేలు తనకు అండగా నిలిచారని తెలిపారు. కాగా, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలా..? వద్దా.. అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘నా పని నేను చేస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే.. అది పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అన్నారు. తనకు అన్ని వేళలా.. ప్రజలు అండగా ఉంటున్నారని, అది రాజకీయమైనా.. కరోనా కాలమైనా.. వారు తనకు మద్దతిస్తున్నారని, అలాంటి ప్రజలకు సేవ చేయకుండా ఎలా ఉంటానని.. పరోక్షంగా ఆయన సీఎంగా కొనసాగుతానని చెప్పారు.
Updated Date - 2022-10-03T09:26:01+05:30 IST