Teacher recruitment scam : సీబీఐ ఛార్జిషీట్లో నిందితునిగా పార్థ ఛటర్జీ
ABN, First Publish Date - 2022-09-30T22:23:37+05:30
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో నిందితుడని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛార్జిషీట్ పేర్కొంది. ఈ కుంభకోణంలో మొత్తం మీద 16 మంది నిందితులు ఉన్నట్లు తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) జూలైలో నిర్వహించిన దాడుల్లో పార్థ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇళ్ళ నుంచి సుమారు 50 కోట్ల రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
పార్థ ఛటర్జీపై సీబీఐ, ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి, టీఎంసీ పార్టీ పదవుల నుంచి తొలగించారు.
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (School Service Commission) సిఫారసు మేరకు ప్రభుత్వ ప్రాయోజిత పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్లో టీచర్లు, గ్రూప్-సీ, గ్రూప్-డీ సిబ్బంది నియామకాల కోసం ఏర్పాట్లు జరిగాయి. ఈ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు పార్థ ఛటర్జీ, తదితరులపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరపాలని సీబీఐని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ కుంభకోణంలో మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇదిలావుండగా, పార్థ ఛటర్జీకి బెయిలు మంజూరు చేసేందుకు స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈడీ అభ్యర్థన మేరకు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని అక్టోబరు 31 వరకు పొడిగించింది. అదేవిధంగా అర్పిత ముఖర్జీ జ్యుడిషియల్ రిమాండ్ను కూడా అక్టోబరు 31 వరకు పొడిగించింది.
సెప్టెంబరు 19న ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, అర్పిత ముఖర్జీ ఇళ్ళ నుంచి నగదు, ఆస్తుల రూపంలో దాదాపు రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, తాజా సమాచారం ప్రకారం ఈ అక్రమ నిధులు రూ.150 కోట్ల వరకు ఉండవచ్చునని తెలిపింది.
Updated Date - 2022-09-30T22:23:37+05:30 IST