Pakistan power crisis : మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత?
ABN, First Publish Date - 2022-07-01T19:58:44+05:30
పాకిస్థాన్లో విద్యుత్తు సంక్షోభం తీవ్రంగా ఉంది. దీంతో మొబైల్, ఇంటర్నెట్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో విద్యుత్తు సంక్షోభం తీవ్రంగా ఉంది. దీంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సేవలను నిలిపేసే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం గురువారం హెచ్చరించింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (NIBT) ట్విటర్ వేదికగా ఈ వివరాలను తెలిపింది.
దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమయంపాటు విద్యుత్తు కోతలు అమలవుతున్నందువల్ల మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తామని టెలికాం ఆపరేటర్లు హెచ్చరించారని పేర్కొంది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ సోమవారం మాట్లాడుతూ, జూలై నుంచి లోడ్ షెడ్డింగ్ పెరుగుతుందని హెచ్చరించారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అవసరమైన పరిమాణంలో సరఫరాకావడం లేదని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల పని గంటలను తగ్గించింది. షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలను త్వరగా మూసేయాలని ఆదేశించింది.
పాకిస్థాన్లో వడగాడ్పుల వల్ల విద్యుత్తుకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఎల్ఎన్జీ కోసం ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
Updated Date - 2022-07-01T19:58:44+05:30 IST