ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్పై స్పందించిన Asaduddin Owaisi.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఆగ్రహం
ABN, First Publish Date - 2022-06-10T01:17:58+05:30
ఢిల్లీ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. ఢిల్లీ పోలీసులపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. బీజేపీని వ్యతిరేకించే వారిపై కేసులు పెట్టడం ద్వారా అధికార పార్టీ మద్దతుదారులను పోలీసులు సంతోషపెడుతున్నారని విమర్శించారు.
చూస్తుంటే యతి నర్సింగానంద్, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్పై కేసులను కొనసాగించే ధైర్యం ఢిల్లీ పోలీసులకు లేనట్టు కనిపిస్తోందన్నారు. అందుకనే ఇంత ఆలస్యంగా బలహీనమైన ప్రతిస్పందన వారి నుంచి వచ్చిందని విమర్శించారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గం గురించి ఢిల్లీ పోలీసులు ఆలోచించి ఉండొచ్చని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు బ్యాలెన్స్ వాడ్ సిండ్రోమ్తో బాధపడుతున్నారని ఒవైసీ అన్నారు. ఒకవైపు వారు బహిరంగంగానే తమ ప్రవక్తను అవమానించారని, మరోవైపు, బీజేపీ మద్దతుదారులను శాంతింప జేసేందుకు రెండు వైపులా విద్వేష పూరిత ప్రసంగాలు ఉన్నట్టు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కేసు విషయానికి వస్తే ఎఫ్ఐఆర్లో అభ్యంతరకరమని కూడా ప్రస్తావించలేదన్నారు. కేసు విషయంలో లాయర్లను సంప్రదిస్తామని, అవసరమైనప్పుడు స్పందిస్తామని ఒవైసీ తెలిపారు. ఈ వ్యూహాలకు తాము భయపడేది లేదని, ద్వేష పూరిత ప్రసంగాలను విమర్శించడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం రెండూ ఒక్కటి కాదని ఒవైసీ తేల్చి చెప్పారు.
Updated Date - 2022-06-10T01:17:58+05:30 IST