ఒమైక్రాన్పై భయం వద్దు
ABN, First Publish Date - 2022-01-11T16:21:00+05:30
రూపాంతరం చెందిన కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’పై ప్రజలు భయాందోళనలు చెందనవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్లలో కరోనా, ఒమైక్రాన్ బాధితుల
- చెన్నైలో టెలి కౌన్సెలింగ్ సెంటర్లు
- మంత్రి సుబ్రమణ్యం
చెన్నై: రూపాంతరం చెందిన కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’పై ప్రజలు భయాందోళనలు చెందనవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్లలో కరోనా, ఒమైక్రాన్ బాధితుల కోసం ప్రత్యేకంగా ‘టెలీ కౌన్సెలింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చెన్నైలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘డెల్టా’ వైరస్ కంటే ఒమైక్రాన్ ప్రాణాపాయం కలిగించదని, దీనికి తోడు ఈ కొత్త వైరస్ వల్ల శ్వాసకోశ సమస్యలుగానీ, గుండెనొప్పి కానీ రాదని స్పష్టం చేశారు. అయితే ఈ రెండు వైరస్ల వల్ల ఆరోగ్యం కాస్త దెబ్బ తింటుందని, ఒకటీరెండు రోజులు ఆస్పత్రిలోగానీ, ఇంటివద్దగాని చికిత్స చేసుకుంటే చాలని ఆయన చెప్పారు. స్థానిక రాజీవ్గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 250 మంది, గిండి కింగ్ఇన్స్టిట్యూట్ ఆస్పత్రిలో 200 మంది చొప్పున ఒమైక్రాన్ బాధితులు చికిత్స పొందుతున్నారని వారంతా కోలుకుంటున్నట్టు వైద్యులు తనకు తెలియజేశారని మంత్రి సుబ్రమణ్యం చెప్పారు. ఒమైక్రాన్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 150 మంది సంపూర్ణంగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు. ఇక కమ్యూనిస్టు సీనియర్ నేత శంకయ్య ఒమైక్రాన్ బారినపడి రాజీవ్గాంధీ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనను తాను పరామర్శించి వచ్చానని చెప్పారు. ఏప్రిల్ 14కు ముందు రెండోడోస్ టీకాలు వేసుకున్నవారందరికీ ప్రస్తుతం బూస్టర్ డోస్ టీకాలు వేస్తున్నామని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా చెన్నై నగరంలో కరోనా, ఒమైక్రాన్ బాధితులకు చికిత్స, ఐసోలేషన్కు సంబంధించి వైద్యనిపుణులతో కౌన్సెలింగ్ ఇవ్వడానికి జోన్కు ఒకటి చొప్పున టెలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ గగన్ దీప్ సింగ్ బేదీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సెంటర్లోనూ ఇద్దరు వైద్య నిపుణులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకునేందుకు, ఆ పరీక్షలలో పాజిటివ్ వచ్చినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాహన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
Updated Date - 2022-01-11T16:21:00+05:30 IST