Samajwadi Party ఎమ్మెల్యే అజంఖాన్కు నాన్ బెయిలబుల్ వారంట్
ABN, First Publish Date - 2022-04-16T13:10:12+05:30
సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అజంఖాన్ తాజాగా మరోసారి చిక్కులో పడ్డారు...
ఫిరోజాబాద్ : సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అజంఖాన్ తాజాగా మరోసారి చిక్కులో పడ్డారు. 15 ఏళ్ల క్రితం నాటి కేసులో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ కోర్టు అజంఖాన్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.2007వ సంవత్సరం ఏప్రిల్ 2వతేదీన ఫిరోజాబాద్లోని హుస్సేనీ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్నప్పుడు ఆజం ఖాన్ రెచ్చగొట్టేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖాన్ ను ఏప్రిల్ 30వతేదీన ఫిరోజాబాద్లోని అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వీడియోలను జిల్లా అధికారులు చూసిన తర్వాత అజం ఖాన్పై రసూల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిఆర్పిసిలోని సెక్షన్ 144, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 188ని ఉల్లంఘించినందుకు ఎస్పి నాయకుడిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అజంఖాన్ గతంలో హైకోర్టు నుంచి అరెస్టుపై స్టే ఆర్డర్ తీసుకున్నారు. అయితే ఈ కేసు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమ్రిష్ త్రిపాఠి కోర్టులో కూడా విచారణలో ఉంది.హైకోర్టు వాయిదా తేదీ ముగిసినా ఆజం ఖాన్ తరపు న్యాయవాది ఎలాంటి దరఖాస్తును సమర్పించలేదు. ఇప్పుడు ఖాన్పై న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్న అజం ఖాన్ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ స్థానంలో పోటీ చేసి పదోసారి గెలిచారు. 2012, 2017 మధ్య ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఖాన్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
Updated Date - 2022-04-16T13:10:12+05:30 IST