NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
ABN, First Publish Date - 2022-08-07T20:45:54+05:30
న్యూఢిల్లీ: దేశ రాజధాని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Governing Council meeting)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. చత్తీస్గఢ్లో గోధన్ న్యాయ్ యోజన (Godhan Nyay Yojana) తీసుకొచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్(Baghel) ను పొగిడారు. అంతేకాదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు.
చత్తీస్గఢ్లో గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా ఆవు పేడను సేకరిస్తారు. కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇది సేకరిస్తున్నారు. 2020 జులై నుంచి ఆవు పేడను సేకరిస్తుండగా, గత నెల 28 నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. లీటర్ గో మూత్రానికి 4 రూపాయలిస్తారు. ఆవు పేడ, మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే ఈ జీవామృతంలో ఉండే సూక్ష్మ జీవులు నేలను సారవంతం చేస్తాయి. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చత్తీస్గఢ్ ప్రభుత్వం నగదు పంపుతోంది. ఈ పథకం ద్వారా గోవుల సంరక్షణతో పాటు పంటపొలాలు సారవంతం కావడం రైతన్నలకు మేలు చేస్తోంది. అంతే కాదు ఆవు పేడ, గో మూత్రం సేకరించే వారికి నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా అందుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అందుకుంటోన్న గోధన్ న్యాయ్ యోజన పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా దీనిపై ఫోకస్ చేశాయి. ఈ తరుణంలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ చత్తీస్గఢ్ సీఎం బాఘేల్ను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Updated Date - 2022-08-07T20:45:54+05:30 IST