PGIMER ఆసుపత్రిలో చేరిన Navjot Sidhu
ABN, First Publish Date - 2022-06-06T23:48:57+05:30
పాటియాలా జైలులో ఉన్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను సోమవారం మధ్యాహ్నం ఛండీగఢ్లోని...
న్యూఢిల్లీ: పాటియాలా జైలులో ఉన్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh sidhu)ను సోమవారం మధ్యాహ్నం ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) హెపలాటజీ డిపార్ట్మెంట్లో వైద్య పరీక్షల కోసం చేర్చారు. ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పాటియాలా జైలు నుంచి ఆయనను భారీ భద్రతతో ఆసుపత్రికి తరలించారు. 1988లో జరిగిన ఓ ఘర్షణ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీంతో స్థానిక కోర్టు ముందు ఆయన లొంగిపోయారు. అనంతరం ఆయనను పాటియాలా కోర్టుకు తరలించారు.
రెండు వారాల క్రితం సిద్ధూను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 58 ఏళ్ల సిద్ధూ రక్తనాళములో రక్తం గట్టకట్టి రక్త ప్రసరణకు అడ్డు తగలడం (ఎంబోలిజం), కాలేయం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో డీవీటీ (డీప్ వీన్ థ్రాంబోసిస్) చికిత్స కూడా చేయించుకున్నారు.
కాగా, జైలులో సిద్ధూకు ప్రత్యేకమైన డైట్ ఇవ్వాలని, గోధుమలు, చక్కెర, మైదా, ఇతర ఆహార పదార్ధాలను ఆయన తీసుకోరదని ఆయన తరఫు న్యాయవాది హెచ్పీఎస్ శర్మ ఇటీవల జైలు అధికారులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. బెర్రీలు, బొప్పాయి, జామ, డబుల్ టోన్డ్ మిల్క్, ఫైబర్, కార్బోహైట్రేట్లు లేని ఆహార పదార్ధాలు ఇవ్వాలని కోరారు.
Updated Date - 2022-06-06T23:48:57+05:30 IST