Delhi Liquor Scam : మోదీ, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చారు : సిసోడియా
ABN, First Publish Date - 2022-08-30T23:16:57+05:30
ఎక్సయిజ్ విధానం అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న
న్యూఢిల్లీ : ఎక్సయిజ్ విధానం అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) అధికారులు తన బ్యాంకు లాకర్ను తనిఖీ చేశారని, అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.
ఘజియాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో మనీశ్ సిసోడియా లాకర్ను సీబీఐ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు ఈ తనిఖీలు జరిగాయి. సిసోడియాతోపాటు ఆయన సతీమణి సమక్షంలో ఈ సోదాలు జరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిపై ఆరోపణలను నమోదు చేసింది.
ఢిల్లీ శాసన సభలో మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, ప్రతిపక్షాల ప్రశ్నలన్నిటికీ తాము సమాధానం చెప్పామన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలకు జవాబు చెప్పలేమని తెలిపారు. లాకర్లో కేవలం సుమారు 80 వేల రూపాయల విలువైన వస్తువులను మాత్రమే సీబీఐ గుర్తించిందన్నారు. వీటిలో తన కుమారుడి ఆట బొమ్మ కూడా ఉందన్నారు.
సిసోడియా ఇచ్చిన ట్వీట్లో, ‘‘లాకర్లో చాలా దొరుకుతుందని వీళ్లంతా అనుకున్నారు. కానీ మొత్తం మీద నా భార్యకు చెందిన రూ.70,000 నుంచి రూ.80,000 వరకు విలువైన ఆభరణాలు, నా కుమారుడి ఆట బొమ్మ మాత్రమే దొరికాయి. ఇది సీబీఐ, పీఎం మోదీల క్లీన్చిట్’’ అని తెలిపారు.
Updated Date - 2022-08-30T23:16:57+05:30 IST