దేశంలో Democracy అతిపెద్ద తప్పిదమన్న అధికారి.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-07-15T01:30:23+05:30
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత్కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ప్రజాస్వామ్యంపై
భోపాల్: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత్కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ప్రజాస్వామ్యంపై మధ్యప్రదేశ్ (Madhyapradesh)కు చెందిన ఓ అధికారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అతిపెద్ద తప్పిదమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. ఆయనపై చర్యలకు శివరాజ్ సింగ్ (Shivraj Singh Chouhan) ప్రభుత్వం సిద్ధమైంది.
బుధవారం జరిగిన స్థానిక సంస్థల చివరి విడత ఎన్నికలకు ముందు శివపురికి చెందిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) ఉమేష్ శుక్లా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన హోంమంత్రి, ప్రభుత్వ అధికారి ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, క్రమశిక్షణ చర్యల కోసం నోటీసు జారీ చేసినట్టు చెప్పారు. అలాగే, ఆయనను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసినట్టు చెప్పారు. ఉమేష్ శుక్లాను తొలగించేందుకు ఎన్నికల సంఘం అంగీకరించిందని, ఒకటి రెండు రోజుల్లో ఆయనను ఆ పోస్టు నుంచి తొలగిస్తుందని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బ్యాలెట్ పేపర్ల కొరత కారణంగా తాము ఓటు వేయలేకపోయామని కొందరు ఉద్యోగులు మంగళవారం శుక్లా వద్ద వాపోయారు. అప్పుడాయన స్పందిస్తూ.. ‘‘ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే అది మీకెలా హాని అవుతుంది. ఓటు వేయడం వల్ల ఏం ఒనగూరింది? ఎంతమంది అవినీతి నాయకులను మనం తయారు చేశాం. దేశంలో ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అతిపెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది.
Updated Date - 2022-07-15T01:30:23+05:30 IST