ప్రభుత్వం నడవడం లేదు.. మేనేజ్ చేస్తున్నామంతే
ABN, First Publish Date - 2022-08-17T06:53:17+05:30
‘రాష్ట్రంలో ప్రభుత్వం నడవడం లేదు. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామంతే...’ అని కర్ణాటక న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ..
కర్ణాటక మంత్రి మాధుస్వామి వ్యాఖ్యలు
బెంగళూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రభుత్వం నడవడం లేదు. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామంతే...’ అని కర్ణాటక న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి జేసీ మాధుస్వామి చేసిన వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది. మూడు నెలల క్రితం సహకారశాఖకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న మాధుస్వామి వీడియోపై సీఎం సహా పలువురు మంత్రులు స్పందించారు. బెంగళూరులో మంగళవారం సీఎం బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ... మాధుస్వామి వ్యాఖ్యలను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తించాలని కోరారు.
తోటలశాఖ మంత్రి మునిరత్న కోలారులో స్పందిస్తూ రాజీనామా చేసి మాట్లాడాలని మాధుస్వామికి సవాల్ విసిరారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న మాధుస్వామి చేసిన వ్యాఖ్యలు సరికావని, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారతాయని అభిప్రాయపడ్డారు. సహకారశాఖ మంత్రి ఎస్టీ సోమశేఖర్ మైసూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి తనను తాను గొప్ప మేధావిగా భావిస్తున్నారని చురకలంటించారు.
Updated Date - 2022-08-17T06:53:17+05:30 IST