వెలవెల బోయిన మోదీ సదస్సు...Varanasi బీజేపీ బూత్ కార్యకర్తల సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు
ABN, First Publish Date - 2022-02-28T14:47:26+05:30
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత పార్లమెంటు నియోజకవర్గమైన వరణాసిలో ఆదివారం జరిగిన బీజేపీ బూత్ కార్యకర్తల సదస్సు వెలవెలబోయింది....
వరణాసి (ఉత్తరప్రదేశ్): సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత పార్లమెంటు నియోజకవర్గమైన వరణాసిలో ఆదివారం జరిగిన బీజేపీ బూత్ కార్యకర్తల సదస్సు వెలవెలబోయింది.వరణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన బూత్ విజయ్ సమ్మేళన్ సభ బీజేపీ కార్యకర్తలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న బిజెపి బూత్ కార్యకర్తల సభలో నరేంద్ర మోదీ ప్రసంగం ఆలస్యం కావడంతో బీజేపీ కార్యకర్తలు వేదిక నుంచి వెళ్లిపోయారు.వరణాసిలోని మొత్తం 3361 బూత్ల నుంచి 20వేల మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొనాల్సి ఉండగా, కార్యకర్తలు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ప్రధాని ప్రసంగం సమయంలో బీజేపీ ఓబీసీ ఫ్రంట్ అధ్యక్షుడు సోమనాథ్ మౌర్య కూడా వెళ్లిపోయారు.
వేదిక నుంచి అందరూ వెళ్లిపోవడానికి గల కారణంపై సోమ్నాథ్ను అడగ్గా.. మధ్యాహ్నం నుంచి ప్రజలు వేదిక వద్ద వేచి ఉన్నారని చెప్పారు. ‘‘అందరూ ఆకలితో, దాహంతో ఉన్నారు. చాలా మంది బహిర్భూమికి వెళ్లారు. ఖాళీగా ఉన్న కుర్చీల్లోకి కార్యకర్తలు తిరిగి వస్తారు.’’ అని బీజేపీ నేత సోమనాథ్ చెప్పారు.మోదీ సభ నుంచి బీజేపీ మండల అధ్యక్షురాలు మోనికా పాండే కూడా వెళ్లిపోయారు. దీనిపై ప్రశ్నించగా తన కుమార్తెకు పరీక్ష ఉందని, తాను మోదీ సభకు మళ్లీ వస్తానని మోనికా చెప్పారు. యూపీ ఎన్నికల పోలింగుకు ముందు వరణాసి జరిగిన బీజేపీ కార్యకర్తల సభ వెలవెల బోవడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2022-02-28T14:47:26+05:30 IST