తెలుగు రాష్ట్రాలకు మరో రెండు హైవేలు
ABN, First Publish Date - 2022-02-23T08:06:11+05:30
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారులను మంజూరు చేసింది. భారత్మాలా పరియోజన ...
భారత్మాలా యోజన కింద రూ.2,824.18 కోట్లు
ఎన్ హెచ్-150సీకి రూ.972.06 కోట్లు
ఎన్హెచ్-71 ప్రాజెక్టుకు 1852.12 కోట్లు: గడ్కరీ
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారులను మంజూరు చేసింది. భారత్మాలా పరియోజన కింద తెలుగు రాష్ట్రాలకు రూ.2,824.18 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టులను మంజూరు చేశామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. అందులో భాగంగా సొలాపూర్-కర్నూలు- చెన్నై ఎకనామిక్ కారిడార్లో రూ.972.06 కోట్లతో ఎన్హెచ్-150సీ ప్రాజెక్టుపై తెలంగాణ-కర్ణాటక సరిహద్దు (రాయచూర్-గద్వాల) నుంచి గద్వాల జిల్లాలోని జూలకల్ గ్రామం వరకు ఆరు లైన్ల హైవేను మంజూరు చేశా మని పేర్కొన్నారు. అలాగే రూ.1852.12 కోట్ల వ్యయంతో ఎన్హెచ్-71పై చిత్తూరు జిల్లా మదనపల్లి-పీలేరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. కాగా, రోడ్లను మంజూరు చేసినందుకు గడ్కరీకి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2022-02-23T08:06:11+05:30 IST