వీస్తున్న విపక్ష పవనం
ABN, First Publish Date - 2022-09-23T07:34:34+05:30
జాతీయస్థాయిలో విపక్షాల పవనం వీయడం వేగవంతమైంది. కాంగ్రె్సతో తిరిగి మమతా..నుబంధం గట్టి పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్
హరియాణా కేంద్రంగా విపక్షాల ఐక్యత
25న దేవీలాల్ సభే ఇందుకు వేదిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: జాతీయస్థాయిలో విపక్షాల పవనం వీయడం వేగవంతమైంది. కాంగ్రె్సతో తిరిగి మమతా..నుబంధం గట్టి పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనకు ఉన్న విభేదాలను పక్కనపెట్టి, బీజేపీ వ్యతిరేక కూటమిలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2024 సార్వత్రిక ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొనే విపక్షాల జట్టులో మమత భాగం అవుతారని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఆమె ఈ విషయం తెలిపినట్టు ఆయన చెప్పారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ఒంటరిగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. సీపీఎంతో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగింది. దీనివల్ల బీజేపీకి ఎంతోకొంత లాభం చేకూరిందని మమత ఇన్నాళ్లు గుర్రుగా ఉన్నాయి. అలాగే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్సతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు తనతోపాటు, బిహార్ సీఎం నితీశ్కుమార్, జమ్ము కశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా సిద్ధంగా ఉన్నామన్నారు. భావ సారూప్య పార్టీల మధ్య సమన్వయం పెంపొందించే పనిలో ప్రస్తుతం తాము ఉన్నామని పవార్ తెలిపారు.
పార్లమెంటుకు పోటీపై నితీశ్ ఖండన
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బిహార్ సీఎం నితీశ్కుమార్ లోక్సభకు పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను గురువారం ఖండించారు. ‘‘నా కోసం నేను ఏమీ చేసుకోను. ఏది చేసినా తేజస్వీ యాదవ్ (డిప్యూటీ సీఎం) వంటి యువకుల భవష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే చేస్తాను’’ అని నితీశ్ వ్యాఖ్యానించారు. నిజానికి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఈ దుమారానికి కారణమయ్యాయి. ‘‘యూపీలోని ఫూల్పూర్ లోక్సభ స్థానానికి అధినేత నితీశ్ పోటీచేయాలని అక్కడి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారు అని లలన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఒకే వేదికపైకి అతిరథ మహారథులు
జాతీయస్థాయిలో మరో రాజకీయ సమీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హరియాణాలోని ఫతేహాబాద్ ఇందుకు వేదికగా మారింది. ఐఎన్ఎల్డీ నేత ఓంప్రకాశ్ చౌతాలా తన తండ్రి, మాజీ డిప్యూటీ ప్రధాని దేవీలాల్ జయంతి వేడుకలను ఈ నెల 25న భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా విపక్ష నాయకులంతా హాజరవుతుండటం రాజకీయ ప్రాథమ్యం సంతరించుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బిహార్ సీఎం నితీశ్కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నాయకురాలు కనిమొళి ఫతేహాబాద్ సభకు వస్తున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓమ్ ప్రకాశ్ చౌతాలా ఇప్పటికే ఆహ్వానం పంపించారు.
Updated Date - 2022-09-23T07:34:34+05:30 IST