కాంగ్రెస్ను వీడటంపై హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-04-15T18:30:02+05:30
గుజరాత్ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ నేతలంతా
గాంధీ నగర్ : గుజరాత్ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ నేతలంతా సమైక్యంగా కృషి చేస్తామని యువ నేత హార్దిక్ పటేల్ చెప్పారు. తాను త్వరలో కాంగ్రెస్ నుంచి వైదొలగబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇవన్నీ వదంతులేనని తెలిపారు. వీటిని ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.
హార్దిక్ పటేల్ గురువారం సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ‘‘నేను కాంగ్రెస్ను వదిలిపెట్టబోతున్నట్లు వదంతులు వస్తున్నాయి. ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ కోసం 100 శాతం శ్రమించాను, ఇకపై కూడా అదేవిధంగా శ్రమిస్తాను. పార్టీలో చిన్న చిన్న పోట్లాటలు, నిందారోపణలు ఉంటాయి. గుజరాత్ను ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం మనమంతా కలిసి పని చేయాలి’’ అని చెప్పారు.
‘‘సత్యం పలకడం నేరమైనట్లయితే, నన్ను అపరాధిగా పరిగణించండి’’ అన్నారు. ప్రజలు మన నుంచి కొన్నిటిని ఆశిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు మనం మద్దతుగా నిలవాలని చెప్పారు.
హార్దిక్ పటేల్ 2019 మార్చిలో కాంగ్రెస్లో చేరారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్నాయి. ఇటీవల హార్దిక్ పటేల్ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తున్నారు. తనను పట్టించుకోవడం లేదని, వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాటిదార్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో జరిగిన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలను గెలుచుకోగలిగిందని, అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
గుజరాత్లో 182 శాసన సభ స్థానాలు ఉన్నాయి. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 77 స్థానాలు లభించాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో 61 స్థానాలు లభించాయి. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లాభపడింది. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనం మద్దతు తగ్గింది.
Updated Date - 2022-04-15T18:30:02+05:30 IST