Delhi: పీయూసీ లేకుంటే బంకుల్లో పెట్రోల్ బంద్
ABN, First Publish Date - 2022-10-01T21:15:42+05:30
వాహన కాలుష్యానికి కళ్లెం వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అక్టోబర్ 25 నుంచి ..
ఢిల్లీ: వాహన కాలుష్యానికి కళ్లెం వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అక్టోబర్ 25 నుంచి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (Pollution under control) సర్టిఫికెట్ తప్పనిసరి. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా చేయకూడదని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal rai) శనివారంనాడు ఈ విషయం వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 25 నుంచి తాజా నిర్ణయం అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలపై సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా-ట్రాఫిక్ శాఖల అధికారులతో సమావేశం జరిపినట్టు ఆయన తెలిపారు.
ఢిల్లీలో వాహన కాలుష్యం పెరగడానికి వాహన వ్యర్థాలు ఒక కారణమని మంత్రి చెప్పారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సవరించిన గ్రేడెడ్ రెస్పాన్ యాక్షన్ ప్లాన్ (జీఆర్పీఏ)ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అక్టోబర్ 3 నుంచి 24X7 వార్ రూమ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 6 నుంచి యాంటీ-డస్ట్ ప్రచారం కూడా చేపడుతున్నామని, డస్ట్ పొల్యూషన్ను తనిఖీ చేసేందుకు నిర్మాణ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని గోపాల్ రాయ్ చెప్పారు.
Updated Date - 2022-10-01T21:15:42+05:30 IST