కన్నడ గొంతు నొక్కుతున్న కేంద్రం
ABN, First Publish Date - 2022-01-29T14:07:22+05:30
కేంద్ర ప్రభుత్వం కన్నడ విషయంలో తరచూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కన్నడ గొంతు నొక్కేలా ఎఫ్ఎం రెయిన్బోపై చర్యలకు సిద్ధమైందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు.
- ఎఫ్ఎం రెయిన్బో రద్దుపై మండిపడ్డ కుమారస్వామి
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం కన్నడ విషయంలో తరచూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కన్నడ గొంతు నొక్కేలా ఎఫ్ఎం రెయిన్బోపై చర్యలకు సిద్ధమైందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. శుక్రవారం ఫేస్బుక్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కన్నడను అణగదొక్కే చర్యలు నిరంతరమయ్యాయని, సాంస్కృతికతను అణగదొక్కేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు సాక్ష్యం లభించిందన్నారు. కన్నడహృదయంపై కాలుపెట్టేలాంటి దుష్ట చర్యలను వ్యతిరేకించకుండా ఉండలేమన్నారు. సూర్యోదయానికి ముందు నుంచే ప్రారంభమై రాత్రి 11 దాకా 18 గంటలపాటు నిరంతరంగా కన్నడ కార్యక్రమాలు సాగిస్తున్న 101.3 ఎఫ్ఎం రెయిన్బో కన్నడ కామనబిల్లు రేడియో ప్రసారాలను గొంతుకోసేలాంటి చర్యలకు కేంద్రం సిద్ధమైందన్నారు. రెయిన్బో కన్నడ కామనబిల్లు కేవలం రేడియో వాహిని మాత్రమే కాదని కన్నడిగుల హృదయస్పందన అని, కన్నడ శక్తి అన్నారు. కేంద్రప్రభుత్వం కన్నడిగుల మనోభావాలపై చెలగాటమాడుతోందన్నారు. అధికారుల ద్వారా కన్నడతల్లి రక్తం కారేలాంటి హీనమైన చర్యలకు సిద్ధమయ్యారన్నారు. గతంలో కన్నడిగులు ఇష్టపడిన అమృతవర్షిణిని ముగించారని, ప్రస్తుతం కన్నడ కామనబిల్లుపై చర్యలకు సిద్ధమయ్యారన్నారు. వేలాది సంవత్సరాల భాష ద్వారా సాగుతున్న సంస్కృతిపై దాడి కన్నడిగులు క్షమించరన్నారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు భాగమని గుర్తుంచుకోవాలని ఒక ఆశయం కోసం ముక్తకంఠంతో కన్నడిగులంతా ఖండించాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2022-01-29T14:07:22+05:30 IST