Eknath Shinde తొలి స్పందన ఇదే...
ABN, First Publish Date - 2022-06-22T00:39:57+05:30
మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ప్రకంపనలు సృష్టిస్తుండగా, ఆ పరిణామాలకు కారణమై, తన అనుచరగణంతో ..
ముంబై: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ప్రకంపనలు సృష్టిస్తుండగా, ఆ పరిణామాలకు కారణమై, తన అనుచరగణంతో అజ్ఞాతంలోకి వెళ్లిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే (Eknath shinde) ట్విట్టర్ వేదకగా తొలిసారి స్పందించారు. బాలాసాహెబ్ (Bal Thackeray థాకరే) బోధనలను తాము ఆదర్శంగా తీసుకున్నామే కానీ ఏరోజూ అధికారం కోసం మోసానికి పాల్పడలేదని అన్నారు.''మేము బాలాసాహెబ్ థాకరేకు బలమైన సైనికులం. బాలాసాహెబ్ మాకు హిందుత్వ పాఠాలు నేర్చించారు. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తున్న మేము అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడేది లేదు'' అని ట్వీట్ చేశారు. దివంగత ఆనంద్ ధిఘే శివసేనకు చెందిన దివంగత దిగ్గజనేత. షిండేకు రాజకీయ గురువు.
కాగా, షిండే ట్వీట్ అనంతరం ఆయనపై శివసేన వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్షనేతగా ఆయనను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌదరిని నియమించింది. థానేలో శివసేన ప్రముఖ నేతగా గుర్తింపు ఉన్న షిండే కొద్దికాలంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంలో శివసేన కూటమికి ఎదురుదెబ్బ తగిలి బీజేపీ పైచేయి సాధించడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో షిండే కొందరు ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా బావుటా ఎగరేసేందుకు సిద్ధపడ్డారని, గుజరాత్లోని సూరత్ హోటల్లో ఉన్నారని తెలుస్తోంది. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా, షిండే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు క్లెయిమ్ చేస్తారా అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశమవుతోంది.
Updated Date - 2022-06-22T00:39:57+05:30 IST