నూలు ధరలు తగ్గించండి
ABN, First Publish Date - 2022-05-20T13:05:25+05:30
పత్తి, నూలు ధరలను తగ్గించేందుకు తక్షణ చర్యల చేపట్టాలని డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర జౌళి శాఖ మంత్రి పియూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం ఉదయం
- కేంద్రమంత్రికి కనిమొళి వినతి
చెన్నై: పత్తి, నూలు ధరలను తగ్గించేందుకు తక్షణ చర్యల చేపట్టాలని డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర జౌళి శాఖ మంత్రి పియూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గురువారం ఉదయం రాష్ట్రానికి చెందిన డీఎంకే, కాంగ్రెస్, డీపీఐ పార్టీల ఎంపీలతో వెళ్ళి కేంద్ర మంత్రిని ఆమె కలుసుకున్నారు. ఆ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ పత్తి నూలు ధరలు కినీవినీ ఎరుగుని రీతిలో పెరగటంతో రాష్ట్రంలోని తిరుప్పూరు, ఈరోడ్ జిల్లాల్లో, బనియన్ల తయారీ కర్మాగారాలు, జౌళి సంస్థలన్నీ మూతపడి ఆ రంగానికి విపరీతంగా నష్టాలు కలుగుతున్నాయన్నారు. జౌళి సంస్థల్లో ఉత్పత్తులు ఆగిపోవడంతో ఎగుమతులు స్తంభించాయని, ఈ విషయాన్ని బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. గురువారం పియూష్ గోయల్కు వినతి పత్రం సమర్పించగా, నూలు ధరలను తగ్గించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు కనిమొళి తెలిపారు. కనిమొళితోపాటు ఎంపీలు ఎస్.జ్యోతిమణి, చిన్నరాజ్, ఎస్ఆర్ పార్తీబన్, కే షణ్ముగసుందరం ఉన్నారు. ఇదిలా ఉండగా కోవై పర్యటనలో ఉన్న సీఎం స్టాలిన్ మంత్రి పీయూష్ గోయల్కు ఫోన్ చేసి పత్తి, నూలు ధరల తగ్గింపు విషయమై మాట్లాడారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి రాష్ట్రంలో జౌళి పరిశ్రమలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-05-20T13:05:25+05:30 IST